Share News

Mahesh Kumar Goud: ఈ నెల్లోనే విస్తరణ

ABN , Publish Date - Jun 07 , 2025 | 04:25 AM

ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును సమీక్షించుకోవాలని హితవు పలికారు.

Mahesh Kumar Goud: ఈ నెల్లోనే విస్తరణ

  • పీసీసీ కొత్త కార్యవర్గం కూడా..

  • ఎమ్మెల్యేలు పనితీరుపై స్వీయసమీక్ష చేసుకోవాలి: మహేశ్‌ గౌడ్‌

  • కేసీఆర్‌ను కాపాడేందుకు ఈటల

  • వకాల్తా పుచ్చుకున్నారని ధ్వజం

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును సమీక్షించుకోవాలని హితవు పలికారు. శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సమక్షంలో జరిగిన కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో సంబంధిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. గ్రామస్థాయి, బూత్‌ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలని.. పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పార్టీ సమర్థంగా పనిచేస్తేనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశముంటుందని తెలిపారు. ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఆశించిన స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని.. కార్యకర్తలు నిరాశగా ఉన్నారని చెప్పారు. వారిని సమన్వయం చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులుగా మనపై ఉందని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలని ఆయన అన్నారు.


ఈటల.. కాళేశ్వరం నిధులతో సంబంధం లేదా?

కేసీఆర్‌ను కాపాడేందుకు వకల్తా పుచ్చుకుని ఈటల రాజేందర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్‌ ఎదుట వివరణ ఇచ్చినట్టుగా ఉందని మహేశ్‌ గౌడ్‌ మండిపడ్డారు. దేశమంతా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కోడై కూస్తే.. అప్పటి ఆర్థికమంత్రి ఈటల ప్రాజెక్టు నిధులతో తనకు సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్‌ తప్పేమీ లేదన్నట్లుగా, అంతా క్యాబినెట్‌ నిర్ణయం మేరకే జరిగిందని ఈటల బుకాయిస్తున్నారని విమర్శించారు. పక్కా ముందస్తు ప్లాన్‌ ప్రకారం కేసీఆర్‌, హరీశ్‌రావు, ఈటల కూడబలుక్కొని ఒక్కటే సమాధానాలు చెప్పాలనుకున్నారన్నారు. కమిషన్‌ ఎదుట విచారణ అనంతరం ఈటల చేసిన వ్యాఖ్యలతో.. హరీశ్‌తో ఆయన రహస్యంగా భేటీ అయ్యారంటూ తాను చేసిన వ్యాఖ్యలే నిజమని తేలిందన్నారు. కాళేశ్వరం అవినీతిలో ఈటలకు సైతం వాటాలు ముట్టినందునే కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడారని ఆరోపించారు. ‘ప్రజలు, రైతుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను పెంచినట్లు ఈటల చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. కేసీఆర్‌ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎంలా మారిందని.. వేల కోట్ల అవినీతి జరిగిందని మొత్తుకున్న ప్రధాని మోదీ, అమిత్‌ షా, బీజేపీ నేతలు ఇప్పుడేమంటారు? ఈటలతో పాటు మీకు కూడా కాళేశ్వరం కమీషన్లు అందాయా? బీఆర్‌ఎ్‌సతో బీజేపీకి ఉన్న లోపాయికారి ఒప్పందం మేరకే కేసీఆర్‌ను కాపాడేందుకు ఈటలతో వివరణ ఇప్పించారా? దీనిపై బీజేపీ నాయకత్వమే సమాధానం చెప్పాలి’ అని అన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 04:25 AM