KTR Challenge: సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్.!
ABN , Publish Date - Jun 13 , 2025 | 07:50 PM
'నేను నగదు బ్యాగ్లతో దొరికిన దొంగను కాదు.. న్యాయమూర్తి, మీడియా సమక్షంలో లై డిటెక్టర్ పరీక్షలో పాల్గొందాం.. వచ్చే ధైర్యం రేవంత్కు ఉందా?' అంటూ సవాల్ విసిరారు కేటీఆర్. పదే పదే విచారణలతో ప్రజాధనం ఎందుకు వృథా చేస్తారంటూ ప్రశ్నించారు.

ఇంటర్నెట్ డెస్క్: ఫార్ములా-ఈ రేస్ కేసులో తెలంగాణ ఏసీబీ నోటీసులివ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఫార్ములా-ఈ కేసులో సోమవారం ఉదయం 10 గంటలకు ‘దర్యాప్తు’కు హాజరవుతానన్నారు. రూ.44 కోట్లు బ్యాంకు నుంచి బ్యాంకుకు బదిలీ చేయబడ్డాయని, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తాను విచారణకు హాజరవుతానని కేటీఆర్ అన్నారు. ACB అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.
'నేను నగదు బ్యాగులతో దొరకిన దొంగను కాదు. నాతోపాటు న్యాయమూర్తి, మీడియా సమక్షంలో 'లై డిటెక్టర్' పరీక్షలో పాల్గొనే ధైర్యం రేవంత్కు ఉందా?' అంటూ సవాల్ విసిరారు కేటీఆర్. పదేపదే విచారణలతో ప్రజాధనం ఎందుకు వృథా చేస్తారంటూ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో ప్రశ్నించారు. కాగా, మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ఈనెల 16న (సోమవారం) ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఈ కేసుకు సంబంధించి మే 28న విచారణకు హాజరుకావాల్సిందిగా మే 26వ తేదీన కేటీఆర్కు ఏసీబీ నోటీసులు పంపింది. అయితే ఆ సమయంలో కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగిసిన తర్వాత విచారణకు హాజరువుతానని ఏసీబీకి మాజీ మంత్రి సమాచారం ఇచ్చారు. దానికి అంగీకారం తెలిపిన ఏసీబీ.. తాజాగా మరోసారి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది.
కాగా.. ఫార్ములా-ఈ రేస్ కేసుకు సంబంధించి గతంలో ఒకసారి ఏసీబీ, ఈడీ ఎదుట కేటీఆర్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. జనవరి 6న లాయర్లతో కలిసి ఏసీబీ విచారణకు వెళ్లిన కేటీఆర్ను అధికారులు అనుమతించకపోవడం తిరిగి వెళ్లిపోయారు. తిరిగి మరోసారి జనవరి 8న ఏసీబీ విచారణ హాజరయ్యారు. దీంతో దాదాపు 7 గంటల పాటు ఆయనను ఏసీబీ విచారించింది. జనవరి 9న మరోసారి విచారణకు పిలవగా.. కేటీఆర్ సమయం కోరారు. ఇంకా ఈ కేసులో మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించింది.
కేసీఆర్ సర్కార్ హయాలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా-ఈ రేస్ నిర్వహించారు. అయితే ఇందులో రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురు పేర్లను ఏసీబీ ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది. ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది ఏసీబీ. ఆ తరువాత జనవరిలో ముగ్గురిని వివిధ తేదీల్లో విచారించిన ఏసీబీ.. ఫార్ములా-ఈ రేస్ కేసుకు సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించింది. మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందనీ ఏసీబీ చెప్పింది. అలాగే గ్రీన్కో ఏస్ నెక్స్ట్జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్కు కూడా ప్రశ్నించింది. అయితే వీరి ముగ్గురిని విచారించి మూడు నెలలు గడిచిపోయింది. తాజాగా కేటీఆర్ను రెండోసారి విచారించాలని ఏసీబీ నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదం.. 10 నిమిషాల గ్యాప్లో ఎస్కేప్.. సుడి బాగుంది!
గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి