Kalvakuntla Kavitha: కవిత బాయ్కాట్!
ABN , Publish Date - May 31 , 2025 | 04:27 AM
సొంత పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్న కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితపై అధిష్ఠానం నిఘా పెట్టింది. ఆమె విషయంలో పార్టీ సీనియర్ నేతలు, కేడర్ సహా ఎవ్వరూ స్పందించవద్దని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

ఆమెకు దూరంగా గులాబీ కేడర్ .. తన వ్యాఖ్యలపై స్పందించవద్దు
నేతలకు స్పష్టమైన ఆదేశాలు
ఆమె పర్యటనపై మీడియాతో నిఘా
కవిత తీరుతో కేసీఆర్ మనస్తాపం
అధినేత నుంచి సొంత మీడియా వరకు పార్టీ వ్యవస్థ అంతా మౌనం
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): సొంత పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్న కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితపై అధిష్ఠానం నిఘా పెట్టింది. ఆమె విషయంలో పార్టీ సీనియర్ నేతలు, కేడర్ సహా ఎవ్వరూ స్పందించవద్దని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అఖరికి ఆమె పాల్గొనే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనవద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒక విధంగా ఆమెను పార్టీ బాయ్కాట్ చేసింది. దానికితోడు కవిత నివాసంతో పాటు, ఆమె ఎక్కడకు వెళ్లినా తనను ఎవరైనా కలుస్తున్నారా? అనేది కూడా పై నుంచి ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె గులాబీ నీఘా నీడలో ఉన్నారు. ఆమె ప్రతీ కదలికను ఆమె చుట్టూ మోహరించిన కొందరి ద్వారా పార్టీ పెద్దలు తెలుసుకుంటున్నట్లు సమాచారం. గత వారం అమెరికా పర్యటన నుంచి వస్తూనే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత నుంచి ఆమె ఇంటికే పరిమితం అవుతూ వస్తున్నారు. కవిత వ్యాఖ్యల అనంతరం ఆమెను తెలంగాణ జాగృతి నేతలు, కేడర్ తప్ప బీఆర్ఎ్సకు చెందిన సీనియర్ నేతలు, కార్యకర్తలు కలిసింది లేదు. దాంతో ఆమె సింగరేణి జాగృతి కమిటీని వేశారు. ఆ కమిటీని వేసిన మరుసటి రోజే పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు ఇద్దరు దూతలు వచ్చి, ఆమెతో రాయబారం నెరిపారు. అదికాస్త విఫలం అయింది. ఆ తర్వాత కూడా ఆమె ఇంటికే పరిమితం అయ్యారు. గురువారం ఆమె మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేటీఆర్, హారీశ్రావు, సంతోష్ కుమార్ సహా అందర్నీ పరోక్షంగా కడిగి పారేశారు. గురువారం చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీని మరింత కుదుపునకు గురి చేశాయి. అలాగే, ఆమె ఆరుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రె్సలో చేరి, మంత్రి పదవి కోసం యత్నిస్తుందన్న వార్తల నేపథ్యంలో కవితపై పార్టీ అధిష్ఠానం నిఘాను తీవ్రతరం చేసింది. రాత్రివేళ కూడా ఆమె ఇంటికి ఎవరెవరు వస్తున్నారు? ఎవరు వెళ్తున్నారన్న విషయాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం మొదట్నించీ పని చేసిన కొందరు సీనియర్స్, ఉద్యమకారులతో కవిత నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీలయితే పలు అంశాలపై చర్చించేందుకు సమావేశం అవుదామని కవితవారిని కోరుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఆమెతో సమావేశమవుతుండగా, మెజార్టీ నేతలు కవితతో భేటీ అయ్యేందుకు ఇష్టపడటం లేదు. పార్టీ ఆదేశాలమేరకు దూరంగా ఉంటున్నారు.
మొహం చాటేశారు
ఇప్పటికే ఆమె చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆదేశాలిచ్చిన బీఆర్ఎస్ అధిష్ఠానం కవిత జిలా పర్యటనలపైనా నిఘా పెట్టింది. శుక్రవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె మంచిర్యాల వెళ్లారు. ఆమె పర్యటనను కేసీఆర్ సొంత మీడియా ప్రతినిధులు అసాంతం నిఘా పెట్టారు. కవిత వెంట ఎవరు ఎవరు ఉన్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు హైదరాబాద్కు చేరవేశారు. మంచిర్యాల పర్యటనలో ఆమె కార్యక్రమానికి హాజరు కాకుండా గులాబీ నేతలు, కేడర్ కవితకు షాక్ ఇచ్చారు. టీజీబీకే అధ్యక్ష హోదాలో ఉన్న సమయంలో కవిత వెంట ఉన్న వందల కార్మికులు, నేతలు సైతం హాజరు కాలేదు. ఆమె పర్యటనను కన్నెత్తి చూడలేదు. ఆమె పర్యటనలో పాల్గొంటే ఎక్కడ తమ రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందోనన్న అనుమానాలు లీడర్లు, కేడర్లో వ్యక్తం అవుతున్నాయి. ఒకరకంగా పార్టీకి దూరమైన, అధిష్ఠానం పెద్దల ఆగ్రహానికి గురైన వారి వెంట ఎవ్వరూ వెళ్లరన్న సంకేతాలను పంపినట్లు అయిందని ఓ సీనియర్ నేతవ్యాఖ్యానించారు. కేసీఆర్ సొంత మీడియా కూడా కవితను పట్టించుకోవడం లేదు. ఆమె వ్యాఖ్యలు అన్ని ప్రధాన మీడియాల్లో పతాక శీర్షికలకు ఎక్కగా... నమస్తే తెలంగాణలో మాత్రం కనీసం పేరు కూడా ప్రచురణకు నోచుకోలేదు. కవితను సొంత పార్టీ నేతలకు, కేడర్కు, మీడియాకు దూరంగా పెట్టడంలో బీఆర్ఎస్ పెద్దలు సఫలమయ్యారని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
నొచ్చుకుంటున్న కేసీఆర్
కవిత వ్యవహారంపై పార్టీ అధినేత కేసీఆర్ నొచ్చుకున్నట్లు పార్టీలోని ఓ సీనియర్ నేత వెల్లడించారు. అందుకే కవిత వ్యవహారం తెరపైకి వచ్చి వారం రోజులు అవుతున్నా ఆయన నోరు విప్పలేదంటున్నారు. ఈ సమస్యకు పుల్స్టాప్ ఎప్పుడు పెట్టేదీ క్లారిటీ కూడా ఇవ్వడం లేదని గులాబీ శ్రేణులంటున్నాయి. శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్హౌజ్లో సీనియర్ నేత హరీశ్రావు కేసీఆర్తో భేటీ అయ్యారు. భేటీలో కవిత అంశం కూడా చర్చకు వచ్చిందని, ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను హరీశ్కు కేసీఆర్ అప్పగించారన్న ప్రచారం సైతం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఎవ్వరూ ధ్రువీకరించడం లేదు. ఒకవైపు పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావాల్సి ఉండటం, మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో రెండోసారి నోటీసులు జారీ అయి, ఏసీబీ ముందు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో కవిత వ్యవహారం గోరుచుట్టుపై రోకలి పోటులా మారిందని మరో సీనియర్ నేత వ్యాఖ్యానించారు. జరుగుతున్న పరిణామాలు పార్టీ కేడర్ను నిస్తేజంలోకి నెట్టివేశాయని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..
ఐఎన్ఎస్ విక్రాంత్ పైనుంచి పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ వార్నింగ్