Bandi Sanjay: కాంగ్రెస్ను వదిలేది లేదు
ABN , Publish Date - May 07 , 2025 | 03:56 AM
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై కటిష్టంగా విరుచుకుపడ్డారు. రేవంత్ రేడ్డి హామీల అమలులో చేతులెత్తారని, కేంద్రం నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని వ్యాఖ్యానించారు.

హామీల అమలులో రేవంత్ చేతులెత్తేశారు.. మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుని నిలదీస్తాం
కేంద్రం నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి: సంజయ్
సిరిసిల్ల, మే 6 (ఆంధ్రజ్యోతి): ఇచ్చిన మాట తప్పి చేతులెత్తేసిన కాంగ్రె్సను వదిలిపేట్టే ప్రసక్తే లేదని, ఆ పార్టీ సంగతి తేలుస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయలేమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేమని సీఎం రేవంత్రెడ్డి పూర్తిగా చేతులెత్తేశారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని చేత పట్టుకొని తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్న రాహుల్గాంధీ.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బుధవారం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తామని, ప్రజలతో కలిసి అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం గంభీరావుపేట మండలంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రమనే కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ‘నాతో ఏం కాదు.. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా.. రాష్ట్రం దివాలా తీసింది..’ అని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ‘ఢిల్లీకి వెళితే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు’ అని రేవంత్ చెప్పడం పచ్చి అబద్ధమని సంజయ్ అన్నారు. ప్రధాన మంత్రిని రేవంత్ చాలా సార్లు కలిశారని, కేంద్ర మంత్రులను ఎప్పుడంటే అప్పుడు కలుస్తూనే ఉన్నారని.. నిన్న కూడా గడ్కరీని కలిశారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులను కలిసి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బాగా సాయం చేస్తోందని పొగుడుతారని, బయటకు వచ్చి నయాపైసా ఇవ్వడం లేదని రెండు నాల్కల ధోరణితో మాట్లాడతారని విమర్శించారు. కేంద్రం నిధులివ్వలేదంటూ రాష్ట్ర సర్కారు ఆరోపణలు చేయడం అబద్ధమని సంజయ్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం నిధులతోనే అని చెప్పారు. కాంట్రాక్టర్తో కలిసి భారీగా కమీషన్లు దండుకుని ఆనాడు రాజీవ్ రహదారిని అడ్డదిడ్డంగా నిర్మించింది కాంగ్రెస్ పార్టీయేనని సంజయ్ మండిపడ్డారు. 2036 దాకా ఆ కాంట్రాక్టు కొనసాగేలా ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్తో ఆ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. రాజీవ్ రహదారిని 6 లేన్లకు విస్తరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని సంజయ్ అన్నారు.
హామీలు ఇచ్చే ముందు తెలియదా: లక్ష్మణ్
హైదరాబాద్/న్యూఢిల్లీ, మే 6(ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు హామీల అమలు తమ వల్ల కాదంటూ కూని రాగాలు తీస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. హామీలు ఇచ్చేముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజలను ఉసిగొల్పుతున్నట్లుగా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని పదే పదే చెప్పడం వెనుక.. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే కుట్ర ఉందన్నారు. రేవంత్రెడ్డి అంత అసమర్థ సీఎంను చూడలేదని, పాలన చేతగాక ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై సీఎం భాష సరికాదన్నారు.