Hyderabad Metro: ఏంటి... అంత ఖర్చవుద్దా!
ABN , Publish Date - May 18 , 2025 | 03:53 AM
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పార్ట్-ఏ డీపీఆర్(డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు)కు అనుమతి రావడం మరింత ఆలస్యమయ్యేలా ఉంది.

నిజంగా రోజుకి అంతమంది ప్రయాణిస్తారా ?
మెట్రో రెండో దశ పార్ట్-ఏ డీపీఆర్పై కేంద్రం సందేహాలు !
లోపాలు సరిచేయాలని హెచ్ఏఎంఎల్కు సూచన
అనుమతుల జారీ మరింత జాప్యం
హైదరాబాద్ సిటీ, మే 18: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పార్ట్-ఏ డీపీఆర్(డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు)కు అనుమతి రావడం మరింత ఆలస్యమయ్యేలా ఉంది. గతేడాది నవంబరు 4న కేంద్రానికి పంపిన డీపీఆర్కు 2, 3 నెలల్లో అనుమతి లభిస్తుందని ఆశించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరికొంత కాలం ఎదురుచూపులు తప్పేలా లేవు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) పంపిన డీపీఆర్లో కొన్ని సాంకేతిక లోపాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఎత్తిచూపడమే ఈ జాప్యానికి కారణమని తె లుస్తోంది. మెట్రో రెండో దశలో ప్రతిపాదిత 5 కా రిడార్లలో కలిపి 76.4 కి.మీ మేర చేపడుతున్న మెట్రో ప్రాజెక్టుకు అసలు రూ.24,269 వేల కోట్లు ఖర్చవుతుందా ? డీపీఆర్లో పేర్కొన్నట్టు 2028లోగా ఆయా మార్గాల్లో 7.96 లక్షల మంది ప్రయాణిస్తారా ? అనే సందేహాలను లేవనెత్తినట్లు సమాచారం. రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మెట్రో రైలు రెండో దశకు శ్రీకారం చుట్టింది. ఇందులో పార్ట్- ఏ కింద నాగోల్-ఎయిర్పోర్టు (కారిడార్-4) 36.8 కి మీ, రాయదుర్గ్-కోకాపేట్ (కారిడార్-5) 11.6 కిమీలు, ఎంజీబీఎస్- చాంద్రాయణగుట్ట (కారిడార్-6) 7.5 కిమీ, మియాపూర్-పటాన్చెరు (కారిడార్-7) 13.4 కిమీ, ఎల్బీనగర్ -హయత్నగర్ (కారిడార్-8) 7.1 కిమీ కారిడార్లను ప్రతిపాదించారు. ఈ మేరకు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పర్యవేక్షణలో రూపొందించిన డీపీఆర్ను గతేడాది నవంబరు 4న కేంద్రానికి సమర్పించారు.
కిమీకి 318కోట్ల అంచనా వ్యయం
రెండో దశ విస్తరణలో కిలోమీటరుకు నిర్మాణ అంచనా వ్యయం రూ.318 కోట్లు. పరిస్థితుల ప్రకారం ఇందులో కొం త హెచ్చుతగ్గులూ ఉంటా యని డీపీఆర్లో పేర్కొన్నట్టు తెలిసింది. బెంగళూరులో కిమీ కి రూ.373 కోట్ల నుంచి రూ.569 కోట్ల వరకు, చెన్నైలో రూ.619 కోట్ల నుంచి రూ.756 కోట్ల వరకు, ముంబైలో రూ.543 కోట్ల నుంచి రూ.1,492 కోట్లతో పనులు చేపట్టారని.. ఎలివేటెడ్ మెట్రో, డిజైన్, ఇన్నోవేషన్తో హైదరాబాద్లో తక్కువ ఖర్చుతో మెట్రో రెండో దశ పనులు చేపట్టే అవకాశం ఉందని వివరించినట్లు సమాచారం. 2017 నుంచి 2024 అక్టోబరు వరకు మొదటి దశలోని 3 కారిడార్లలో 63.40 కోట్ల మంది ప్రయాణించారని, మెట్రో రెండో దశ 2028లోగా పూర్తి చేస్తే.. 2 దశల్లో కలిపి రోజుకు దాదాపు 10 నుంచి 12 లక్షల మంది వరకు ప్రయాణించే అవకాశం ఉందన్నారు.
కేంద్రం ఏం అడిగిన ప్రశ్నలు ఏంటంటే ?
డీపీఆర్లో చెప్పిన దానికి క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ఇటీవల హెచ్ఏఎంఎల్కు తమ సందేహాలను కొన్ని ప్రశ్నల రూపంలో పంపినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. సాంకేతిక, ఆర్థిక విశ్లేషణల్లో కొన్ని అస్పష్టతలున్నాయని, ప్రయాణికుల ట్రాఫిక్ అంచనాలు, చూపిన ఖర్చులు సరిగా లేవని కేంద్రం పేర్కొంది. నాగోల్, ఎల్బీనగర్, మియాపూర్, చాంద్రాయణగుట్ట మార్గాల్లో భూసేకరణ సమస్యలు, రోడ్డు వెడల్పు పరిమితులను సక్రమంగా రూపొందించలేదని, డీపీఆర్ రూపకల్పనలో కేంద్ర మార్గదర్శకాలను అనుసరించలేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రయాణికుల అంచనాలు అతిశయోక్తిగా ఉన్నాయని, ఖర్చు అంచనాలూ అస్పష్టంగా ఉన్నాయనీ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. హెచ్ఎఎంఎల్ అధికారు లు తాము పంపిన డీపీఆర్లో ఒకవేళ తప్పులుంటే ఉంటే వాటిపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నమూ చేస్తున్నారు. కాగా, ఇటీవల హైదరాబాద్ వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నితిన్ గడ్కరీని.. మెట్రో రెండో దశ డీపీఆర్ అనుమతి విషయమైౖ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కలిసినట్లు తెలిసింది. డీపీఆర్లో తమ అధికారులు అడిగిన ప్రశ్నలకు హెచ్ఏఎంఎల్ సరైన సమాధానాలు రాకపోవడంతో ఆలస్యం జరుగుతోందని ఆయన వారికి బదులిచ్చినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News