Share News

CCTV Cameras: 74 వేల రైల్వే కోచ్‌లు, 15 వేల లోకోమోటివ్‌లలో సీసీ కెమెరాలు.. అసలు కారణమిదే..

ABN , Publish Date - Jul 13 , 2025 | 09:33 PM

ప్రయాణీకుల భద్రతపై ఫోకస్ చేసిన రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు అన్ని రైల్వే కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ చర్య ప్రయాణీకుల భద్రతను పెంచడమే కాకుండా, రైళ్లలో చోరీలు, ఇతర అక్రమ కార్యకలాపాల వంటివి తగ్గనున్నాయి.

CCTV Cameras: 74 వేల రైల్వే కోచ్‌లు, 15 వేల లోకోమోటివ్‌లలో సీసీ కెమెరాలు.. అసలు కారణమిదే..

ప్యాసింజర్ కోచ్‌లలో ప్రయాణీకుల భద్రత కోసం రైల్వే శాఖ (Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలను (CCTV Cameras) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల ప్రయాణీకుల భద్రత పెరగడంతోపాటు చోరీలు తగ్గే అవకాశం ఉంది. కెమెరాల ఏర్పాటు వల్ల ఇటువంటి ఘటనలు చాలా వరకు తగ్గుతాయి.

ప్రయాణీకుల గోప్యతను కాపాడటానికి, తలుపుల దగ్గర, సాధారణ కదలిక ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవ్నీత్ సింగ్.. ఇంజిన్లు, కోచ్‌లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు గురించి శనివారం సమీక్షించి, ప్రకటించారు.


360 డిగ్రీల కవరేజ్

ఉత్తర రైల్వేలోని లోకో ఇంజిన్లు, కోచ్‌లలో విజయవంతమైన ట్రయల్స్ ఇప్పటికే నిర్వహించబడ్డాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మొత్తం 74,000 కోచ్‌లు, 15,000 ఇంజిన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అనుమతి ఇచ్చారు.

ప్రతి రైల్వే కోచ్‌లో 4 డోమ్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయబడతాయి. ప్రతి ప్రవేశ మార్గంలో 2, ప్రతి లోకోమోటివ్‌లో 6 సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. వీటిలో లోకోమోటివ్ ముందు, వెనుక, రెండు వైపులా 1 కెమెరా ఉంటాయి. ప్రతి క్యాబ్ (ముందు, వెనుక)లో 1 డోమ్ సీసీటీవీ కెమెరా, డెస్క్‌పై 2 మైక్రోఫోన్‌లు ఏర్పాటు చేయబడతాయి.


ఆధునిక నిఘా

సీసీటీవీ కెమెరాలు తాజా ప్రమాణాలతో ఉంటాయని, STQC సర్టిఫికేట్ పొందాయని అధికారులు వెల్లడించారు. ఈ పరికరాలను ఉపయోగించడంపై కేంద్ర రైల్వే మంత్రి కీలక ప్రకటన చేశారు. ఇవి 100 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో, తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా మంచి ఫుటేజ్ అందించేలా చూసుకోవాలని ఆయన రైల్వే అధికారులకు సూచించారు. ఇండియా ఏఐ మిషన్ సహకారంతో సీసీటీవీ కెమెరాల డేటాపై AI వినియోగాన్ని అన్వేషించాలని కేంద్ర రైల్వే మంత్రి అధికారులకు తెలిపారు.


డేటా గోప్యత

కోచ్‌ల సాధారణ కదలిక ప్రాంతాలలో కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణీకుల భద్రత మెరుగుపరచడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు. కస్టమర్ల గోప్యతను దృష్టిలో ఉంచుకుని, ఈ కెమెరాలు అనేక అంశాలను గుర్తించడంలో సహాయపడతాయి. దీంతో భారతీయ రైల్వేలు ఇకపై ప్రయాణికులకు మరింత సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించనున్నాయి.


ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 09:47 PM