T20 WC: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ABN , Publish Date - Nov 25 , 2025 | 07:30 PM
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో భారత్-పాక్ జట్లు ఫిబ్రవరి 15న తలపడనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం ఐసీసీ దీనికి సంబంధించిన జాబితాను అధికారికంగా ప్రకటించింది. భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు భాగం కానున్నాయి. అయితే తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాక్-నెదర్లాండ్స్ మధ్య కొలంబో వేదికగా జరగనుంది.
ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఇటలీ మొదటి సారి టోర్నీకి అర్హత సాధించింది. 20 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8లోని నాలుగు జట్లను రెండు గ్రూప్లుగా విభజిస్తారు. ఇందులో టాప్-2 జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్లు భారత్లోని అయిదు వేదికల్లో (అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబయి), శ్రీలంకలోని మూడు వేదికల్లో (పల్లెకెలె స్టేడియం, కొలంబోలోని రెండు స్టేడియాల్లో) జరగనున్నాయి.
ఫిబ్రవరి 15న..
దాయాది పాకిస్తాన్తో పోరు అంటే ప్రతి క్రికెట్ అభిమానికి ఆసక్తే. ఈ టోర్నీలో ఇండియా-పాక్ జట్లు ఫిబ్రవరి 15న కొలంబోలో తలపడనున్నాయి. ఈ చిరకాల ప్రత్యర్థులు ఒకే గ్రూప్లో ఉండటం విశేషం. ఆసియా కప్లో ఇరు జట్ల మధ్య పోటీ జరగగా.. టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి: