Kerala Cricket Association: శ్రీశాంత్పై మూడేళ్ల సస్పెన్షన్
ABN , Publish Date - May 03 , 2025 | 04:21 AM
కేరళ క్రికెట్ సంఘంపై నిరాధార ఆరోపణలు చేసిన శ్రీశాంత్పై కేసీఏ మూడు సంవత్సరాల నిషేధాన్ని విధించింది. సంజూ శాంసన్ ఎంపిక విషయంలో సంఘంపై వ్యాఖ్యలు చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

కేరళ క్రికెట్ సంఘం నిర్ణయం
తిరువనంతపురం: చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న భారత జట్టునుంచి సంజూ శాంసన్ను తొలగించడానికి సంబంధించి నిరాధార ఆరోపణలు చేసిన మాజీ పేసర్ శ్రీశాంత్పై కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) కొరడా ఝళిపించింది. అతడిని మూడు సంవత్సరాలు సస్పెండ్ చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈమేరకు గతనెల 30న కొచ్చిలో జరిగిన కేసీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేరళ క్రికెట్ లీగ్లో కొల్లం ఏరీస్కు శ్రీశాంత్ సహ యజమానిగా ఉన్నాడు.
వివాదం ఏమిటంటే..: విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీకి కేరళ జట్టులో సంజూని కేసీఏ ఎంపిక చేయలేదని..దరిమిలా అతడు చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడని ఓ మలయాళ టీవీ చానెల్ చర్చలో శ్రీశాంత్ ఆరోపించాడు. దాంతో శ్రీశాంత్కు కేసీఏ నోటీసు జారీ చేసింది. అయితే శాంసన్కు మద్దతు ఇచ్చినందుకు కాకుండా కేసీఏ పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యానించినందునే శ్రీశాంత్కు నోటీసు ఇచ్చినట్టు సంఘం పేర్కొంది. అలాగే సంజూ ఎంపికకు సంబంధించి అసోసియేషన్పై నిరాధార ఆరోపణలు చేసిన అతడి తండ్రి విశ్వనాథ్తోపాటు మరో ఇద్దరిపై నష్టపరిహారం కోసం చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు కూడా కేసీఏ తెలిపింది.