IPL 2025 Qualifier 2: ముంబై ముందుకు
ABN , Publish Date - May 31 , 2025 | 03:58 AM
ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ను 20 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. రోహిత్ శర్మ 81 పరుగులతో మెరుపు ప్రదర్శన కనబరచగా, సాయి సుదర్శన్ గట్టి పోరాటం చేశాడు.

క్వాలిఫయర్-2కు అర్హత
రోహిత్ హాఫ్ సెంచరీ
పోరాడిన సాయి సుదర్శన్
గుజరాత్ ఇంటికి
ముల్లన్పూర్: ఆల్రౌండ్షోతో చెలరేగిన ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. బ్యాటర్లు కలిసికట్టుగా కదం తొక్కడంతో పాటు బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశారు. దీంతో శుక్రవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 20 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా ఆదివారం పంజాబ్తో పోరుకు సిద్ధమైంది. ఇందులో గెలిచిన జట్టు బెంగళూరుతో ఫైనల్లో తలపడుతుంది. ఇక భారీ ఛేదనలో సాయి సుదర్శన్ (49 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో 80) అద్భుతంగా పోరాడినా అతడికి పెద్దగా సహకారం అందలేదు. లీగ్ ఆరంభం నుంచి దాదాపు టేబుల్ టాపర్గానే కొనసాగిన టైటాన్స్ చివరకు ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ముందుగా ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. రోహిత్ (50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 81), బెయిర్స్టో (22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 47), సూర్యకుమార్ (20 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 33) వేగంగా ఆడారు. ప్రసిద్ధ్, సాయి కిశోర్లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసి ఓడింది. సుందర్ (48), రూథర్ఫోర్డ్ (24) ఓ మాదిరిగా ఆడారు. బౌల్ట్కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా రోహిత్ నిలిచాడు.
చివర్లో తడబాటు: భారీ ఛేదనలో గుజరాత్కు తొలి ఓవర్లోనే గట్టి ఝలక్ తగిలింది. కెప్టెన్ గిల్ (1)ను పేసర్ బౌల్ట్ ఎల్బీగా వెనక్కి పంపాడు. కానీ మరో ఓపెనర్ సాయి సుదర్శన్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. కానీ విజయం ఖాయమనుకున్న దశలో కీలక వికెట్లు తీసిన ముంబై బౌలర్లు మ్యాచ్ను తమ వైపునకు తిప్పేశారు. ఆరంభంలో సాయి, వన్డౌన్ బ్యాటర్ కుశాల్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అలాగే పవర్ప్లేలో జట్టు 66/1 స్కోరు చేసింది. ఆ వెంటనే స్పిన్నర్ శాంట్నర్ ఓవర్లో కుశాల్ హిట్ వికెట్గా వెనుదిరిగాడు. అయితే సాయి మాత్రం ఎదురుదాడి ఆపలేదు. ఈ దశలో మ్యాచ్ గుజరాత్ వైపే కనిపించింది. కానీ బుమ్రా 14వ ఓవర్లో సూపర్ యార్కర్తో సుందర్ను బౌల్డ్ చేయడంతో సీన్ మారిపోయింది. అప్పటికి మూడో వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యం జత చేరింది. ఆ తర్వాత పేసర్ గ్లీసన్ టైటాన్స్కు గట్టి షాక్ ఇస్తూ సుదర్శన్ను బౌల్డ్ చేయడంతో టైటాన్స్ చేసేదేమీ లేకపోయింది. దీనికి తోడు బుమ్రా 18వ ఓవర్లో 9 పరుగులే ఇవ్వడంతో సమీకరణం మరింత క్లిష్టంగా మారింది. రూథర్ఫోర్డ్ (24)ను బౌల్ట్ అవుట్ చేయడంతో చివ రి ఆరు బంతుల్లో టైటాన్స్కు 24 పరుగులు అవసరమయ్యాయి. కానీ మూడు పరుగులే రావడంతో ముంబై సంబరాల్లో మునిగింది.
కలిసికట్టుగా..: టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై ధనాధన్ ఆటతీరుతో హోరెత్తించింది. క్రీజులోకి దిగిన ప్రతీ బ్యాటర్ గుజరాత్ బౌలర్లపై ఆధిపత్యం చూపాడు. దీనికి తోడు వారి ఫీల్డింగ్ వైఫల్యం కూడా కలిసివచ్చింది. రికెల్టన్ స్థానంలో బరిలోకి దిగిన ఓపెనర్ బెయిర్స్టో తుఫాన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ రోహిత్ నిలకడగా కొనసాగాడు. చివర్లో హార్దిక్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో భారీ స్కోరు సాధ్యమైంది. వాస్తవానికి రోహిత్ మూడు పరుగుల వద్ద ఉన్నప్పుడు కొట్జీ సులువైన క్యాచ్ను వదిలేశాడు. అలాగే 12 పరుగుల వద్ద కీపర్ కుశాల్ కూడా అందుకోలేకపోయాడు. అటు బెయిర్స్టో నాలుగో ఓవర్లో 6,4,6,6,4తో 26 పరుగులు రాబట్టాడు. ఇక ఆరో ఓవర్లో రోహిత్ 6,4,4తో పవర్ప్లేలో జట్టు 79 పరుగులు సాధించింది. బెయిర్స్టో జోరుకు ఎనిమిదో ఓవర్లో స్పిన్నర్ సాయికిశోర్ బ్రేక్ వేశాడు. సుదర్శన్ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవాలనుకున్నా ఆ బంతి లక్కీగా పక్కనే ఉన్న కొట్జీ చేతుల్లో పడింది. దీంతో తొలి వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత స్పిన్నర్లు రషీద్, సాయి ఓవర్లలో రోహిత్ బౌండరీలతో ధాటిని కొనసాగించగా.. సూర్య సైతం కొట్జీ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. అదే ఓవర్లో సూర్య క్యాచ్ను కీపర్ కుశాల్ వదిలేశాడు. కానీ 13వ ఓవర్లో స్వీప్ షాట్కు వెళ్లి సూర్య అవుటయ్యాడు. అప్పటికే రెండో వికెట్కు 59 పరుగులు జత చేరాయి. అనంతరం డెత్ ఓవర్లలో వరుసగా రోహిత్, తిలక్ (25), నమన్ (9) వికెట్లను కోల్పోయినా.. చివరి ఓవర్లో కెప్టెన్ హార్దిక్ (22 నాటౌట్) మూడు సిక్సర్లతో 22 పరుగులు రాబట్టి స్కోరును 220+ దాటించాడు.
స్కోరుబోర్డు
ముంబై: రోహిత్ (సి) రషీద్ (బి) ప్రసిద్ధ్ 81, బెయిర్స్టో (సి) కొట్జీ (బి) సాయి కిశోర్ 47, సూర్యకుమార్ (సి) వాషింగ్టన్ (బి) సాయి కిశోర్ 33, తిలక్ (సి) మెండిస్ (బి) సిరాజ్ 25, హార్దిక్ (నాటౌట్) 22, నమన్ ధిర్ (సి) రషీద్ (బి) ప్రసిద్ధ్ 9, శాంట్నర్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 228/5; వికెట్ల పతనం: 1-84, 2-143, 3-186, 4-194, 5-206; బౌలింగ్: సిరాజ్ 4-0-37-1, ప్రసిద్ధ్ 4-0-53-2, సాయి కిశోర్ 4-0-42-2, రషీద్ 4-0-31-0, కొట్జీ 3-0-51-0, వాషింగ్టన్ 1-0-7-0.
గుజరాత్: సాయి సుదర్శన్ (బి) గ్లీసన్ 80, గిల్ (ఎల్బీ) బౌల్ట్ 1, మెండిస్ (హిట్ వికెట్) (బి) శాంట్నర్ 20, వాషింగ్టన్ (బి) బుమ్రా 48, రూథర్ఫర్డ్ (సి) తిలక్ (బి) బౌల్ట్ 24, తెవాటియా (నాటౌట్) 16, షారుక్ (సి) సూర్య (బి) అశ్వనీ కుమార్ 13, రషీద్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 208/6; వికెట్ల పతనం: 1-3, 2-67, 3-151, 4-170, 5-193, 6-208; బౌలింగ్: బౌల్ట్ 4-0-56-2, బుమ్రా 4-0-27-1, గ్లీసన్ 3.3-0-39-1, హార్దిక్ 3-0-37-0, శాంట్నర్ 1-0-10-1, నమన్ ధిర్ 1-0-9-0, అశ్వనీ కుమార్ 3.3-0-28-1.