Share News

Asian Athletics Championship: నందినికి పసిడి

ABN , Publish Date - May 31 , 2025 | 03:19 AM

ఆసియా అథ్లెటిక్స్‌లో భారత్‌కు పసిడి పతకాలు అనుభవం. నందిని మహిళల హెప్టాథ్లాన్‌లో, గుల్వీర్‌ సింగ్‌ 5000 మీటర్ల రేసులో, పూజా సింగ్‌ హైజంప్‌లో బంగారు పతకాలు సాధించారు.

 Asian Athletics Championship: నందినికి పసిడి

  • గుల్వీర్‌, పూజకు కూడా.. జూ ఆసియా అథ్లెటిక్స్‌

గుమి (దక్షిణ కొరియా): ఆసియా అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారుల స్వర్ణ సంబరం కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పోటీల్లో ఏకంగా ముగ్గురు అథ్లెట్లు పసిడి పతకాలు కొల్లగొట్టారు. తెలుగమ్మాయి అగసర నందిని మహిళల హెప్టాథ్లాన్‌ (5941 పాయింట్లు)లో విజేతగా నిలిచింది. ఈ క్రమంలో సోమా బిశ్వాస్‌ (2005), స్వప్నా బర్మన్‌ (2017) తర్వాత ఆసియా అథ్లెటిక్స్‌లో స్వర్ణం నెగ్గిన మూడో భారత మహిళా హెప్టాథ్లెట్‌గా నందిని రికార్డుకెక్కింది. ఇక గుల్వీర్‌ సింగ్‌.. 5,000 మీటర్ల రేసులో చాంపియన్‌గా నిలిచి తన ఖాతాలో రెండో పసిడి వేసుకున్నాడు. ఇక, హైజం్‌పలో పూజా సింగ్‌ (1.89 మీ) లంఘించి బంగారు పతకం దక్కించుకుంది. మహిళల 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పారుల్‌ ఛౌదరి రజతానికి పరిమితమైంది. పురుషుల 4గీ100 మీటర్ల రిలే ఈవెంట్‌లో భారత జట్టు సభ్యుల్లో ఒకరు ఫౌల్‌ చేయడంతో టీమ్‌ అనర్హతకు గురైంది. ఇక 200 మీటర్ల రేసులో తెలుగమ్మాయిలు జ్యోతి యర్రాజి, నిత్య గంధె ఫైనల్‌కు దూసుకెళ్లారు. టోర్నీలో భారత్‌ ఇప్పటిదాకా మొత్తం 18 పతకాలు (8 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలు) సాధించింది. పోటీలకు ఆఖరిరోజైన శనివారం భారత్‌ ఖాతాలో మరిన్ని పతకాలు చేరే అవకాశముంది.

వీర జవాన్లకు అంకితం..

నేను ఈ పోటీల్లో పతకం గెలవడానికి మన త్రివిధ దళాలు ఇచ్చిన స్ఫూర్తే కారణం. దేశ సరిహద్దుల్లో వారు ప్రాణాలను ఫణంగా పెట్టి రక్షణ కల్పించడం వల్లే మనమంతా క్షేమంగా ఉన్నాం. ఆపరేషన్‌ సిందూర్‌లో ప్రాణాలు కోల్పోయిన భారత వీర జవాన్లకు ఈ పతకం అంకితం.

- అగసర నందిని

Updated Date - May 31 , 2025 | 03:23 AM