Shreyas Iyer: చరిత్ర సృష్టించిన అయ్యర్.. 18 ఏళ్లలో ఒకే ఒక్కడు!
ABN , Publish Date - Jun 02 , 2025 | 08:18 AM
పంజాబ్ కింగ్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. పటిష్టమైన ముంబై ఇండియన్స్ను ఓడించి ఐపీఎల్-2025 ఫైనల్లోకి దూసుకెళ్లింది అయ్యర్ సేన.

క్వాలిఫయర్ ఫైట్.. ఎదురుగా ఉన్నది 5 టైటిల్స్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి హేమాహేమీలతో పోరు. ఇటు చూస్తే ఇంతవరకు ఒక్క కప్పు కూడా నెగ్గని పంజాబ్ కింగ్స్ టీమ్. పైగా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో అంతగా అనుభవం లేని కుర్రాళ్ల యూనిట్. అయినా ఏమాత్రం భయం, బెరుకు లేకుండా ఆడి.. ఫేవరెట్ ముంబైని చిత్తుగా ఓడించారు. అసాధ్యం అనుకున్న గెలుపును సుసాధ్యం చేశారు. తీవ్ర ఒత్తిడిలో 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనను ఇంకో ఓవర్ ఉండగానే పూర్తి చేసి ఐపీఎల్-2025 ఫైనల్కు చేరుకుంది పంజాబ్. దీంతో ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు శ్రేయస్ అయ్యర్. అదేంటో ఇప్పుడు చూద్దాం..
వాటే ఫీట్!
ఐపీఎల్ చరిత్రలో సారథ్యం వహిస్తూ మూడు వేర్వేరు జట్లను ఫైనల్కు తీసుకెళ్లిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు శ్రేయస్ అయ్యర్. అతడి కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ 2020 సీజన్లో ఫైనల్కు చేరుకుంది. ఆ తర్వాత 2024లో కోల్కతా నైట్ రైడర్స్ను ఫైనల్కు తీసుకెళ్లడమే గాక కప్పు కూడా అందించాడు అయ్యర్. ఈసారి పంజాబ్ కింగ్స్ ఆఖరి పోరుకు అర్హత సాధించేలా చేశాడు. దీంతో మూడు వేర్వేరు జట్లను ఫైనల్కు తీసుకెళ్లిన తొలి సారథిగా అతడు అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు.
సమ్థింగ్ స్పెషల్..
ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన సారథులుగా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్కు ట్రోఫీల మీద ట్రోఫీలు అందిస్తూ వచ్చాడు మాహీ. అటు రోహిత్ కూడా సారథిగా మోస్ట్ సక్సెస్ఫుల్ అనిపించుకున్నాడు. ఏకంగా ముంబైకి 5 టైటిల్స్ అందించాడు. అయితే వీళ్లు కేవలం ఒకే జట్టు తరఫున సారథిగా సక్సెస్ అయ్యారు. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం వేర్వేరు జట్లకు కెప్టెన్గా వ్యవహరిస్తూ.. ప్రతి జట్టును ఫైనల్కు తీసుకెళ్లి తాను సమ్థింగ్ స్పెషల్ అనిపించుకున్నాడు. ఒకవేళ రేపటి తుదిపోరులో పంజాబ్ కింగ్స్ గనుక నెగ్గితే అతడి కెప్టెన్సీకి తిరుగుండదనే చెప్పాలి. ఇదే అదనుగా భారత టీ20 జట్టు సారథ్య పగ్గాలు అయ్యర్కు ఇవ్వాలనే డిమాండ్ మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి