Share News

TANA: కేంద్ర సాహిత్య అకాడమీకి తానా కీలక సూచన

ABN , Publish Date - May 28 , 2025 | 10:45 AM

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. భారతీయ భాషలు అసంఖ్యాకంగా ఉన్నాయన్నారు. ఆ జాబితాలోని 24 భాషలకు ప్రతి ఏటా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రదానం చేస్తుందన్నారు.

TANA: కేంద్ర సాహిత్య అకాడమీకి తానా కీలక సూచన

డల్లాస్, మే 28: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార పోటీలకు వచ్చే తెలుగు రచనలు ఇతర భాషలతో పోలిస్తే.. వాసిలోనూ, రాశిలోనూ సంతృప్తికర స్థాయిలోనే ఉన్నాయని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. కృతివెంటి శ్రీనివాసరావు వెల్లడించారు. అయితే మన తెలుగు రచనలు మరిన్ని ఆంగ్ల, హిందీ తదితర భాషల్లోకి అనువాదం కావాల్సి ఉందన్నారు. ఇక ఈ ఏడాది నుంచి రచయితలు ఎవరికి వారే ఈ పోటీలకు స్వయంగా తమ రచనలు పంపుకోవచ్చని ఆయన సూచించారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల ఆఖరి ఆదివారం నెల నెలా తెలుగు వెలుగు పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాలలో భాగంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలతో మాటా మంతీ అనే అంశంపై 80వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం జరిగింది. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలికారు. ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తెలుగు సాహితీ వేత్తలలో కొంత మంది ఈ రోజు ఇలా ఒకే వేదిక మీద పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెల్పి.. వారందరికి ఆత్మీయ ఆహ్వానం పలికారు.

TANA-1.jpg


అనంతరం తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. భారతీయ భాషలు అసంఖ్యాకంగా ఉన్నాయన్నారు. ఆ జాబితాలోని 24 భాషలకు ప్రతి ఏటా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రదానం చేస్తుందన్నారు. అంతటి అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న 8 మంది తెలుగు సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో ఇలా పాల్గొని.. వారు పురస్కారం పొందిన రచనలపై స్వీయ విశ్లేషణ చేయడం చాలా వినూత్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం కేవలం భారతీయ పౌరసత్వం కల్గిన వారు మాత్రమే ఈ పురస్కారాలు అందుకోవడానికి అర్హులుగా ఉన్నారన్నారు. కాని పద్మ పురస్కారాల వలే.. భారతీయ పౌరసత్వంతో సంబంధం లేకుండా, వివిధ దేశాలలో స్థిరపడిన భారతీయ మూలాలున్న రచయితలను సైతం ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు అర్హులుగా చేయాలని ఈ సందర్భంగా అకాడమీకి ఆయన సూచించారు. తద్వారా మరిన్ని వైవిధ్య భరితమైన రచనలు ఈ పోటీలకు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని పరిశీలించాలని లక్షలాది మంది ప్రవాస భారతీయుల తరపున కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావుకు డా.ప్రసాద్ తోటకూర విజ్ఞప్తి చేశారు.


ఈ సాహిత్య కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా.. డా.గోరటి వెంకన్న, “వల్లంకి తాళం” కవిత, 2021-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత; డా. మధురాంతకం నరేంద్ర, “మనోధర్మ పరాగం” నవల, 2022-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత; డా. తల్లావజ్జల పతంజలి శాస్త్రి, “రామేశ్వరం కాకులు, మరికొన్ని కథలు”, 2023-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత; డా. ఎలనాగ (నాగరాజు సురేంద్ర), Galib-The Man, The Times, in English by Mr. Pavan Varma; “గాలిబ్ నాటి కాలం” తెలుగు అనువాదం-2023-కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత;

పెనుగొండ లక్ష్మీనారాయణ, “దీపిక” రచనకు-2024-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పమిడిముక్కల చంద్రశేఖర ఆజాద్, “మాయా లోకం” నవల, 2024-కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారగ్రహీత, డా. తుర్లపాటి రాజేశ్వరి, ఒడియా నవల “దాడీ బుధా” ను “ఈతచెట్టు దేవుడు” గా తెలుగులోకి అనువాదం- 2024-కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార విజేతలు పాల్గొని.. తమ పురస్కార రచనలకు సంబంధించిన విశేషాలను ఆసక్తిగా వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి

గులాం నబీ ఆజాద్‌కు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

అధ్యక్షుడిగా చంద్రబాబు అరుదైన ఘనత

For National News And Telugu News

Updated Date - May 28 , 2025 | 10:46 AM