ECI: లిఖితపూర్వకంగా కోరితే స్పందిస్తాం.. రాహుల్ వ్యాఖ్యలపై ఈసీ
ABN , Publish Date - Jun 08 , 2025 | 07:21 PM
ఎన్నికల కమిషన్పై ఎంపీ రాహుల్ గాంధీ శనివారం నాడు విమర్శలు ఎక్కుపెట్టారు. తీవ్రమైన ఆరోపణలకు ఈసీ జవాబులు దాటవేస్తోందని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్-ఫిక్సింగ్ జరిగిందని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇది పునరావృతం కావచ్చని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ లోక్సభా విపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) సామాజిక మాధ్యమాల్లో చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ (ECI) స్పందించింది. లిఖిత పూర్వకంగా ఆయన ఫిర్యాదు చేస్తేనే ఎన్నికల కమిషన్ స్పందించగదలని కమిషన్ వర్గాలు ఆదివారం నాడు తెలిపాయి. ఎన్నికల అనంతరం మేలో ఆరు జాతీయ పార్టీలతో వేర్వేరుగా ఎన్నికల కమిషన్ సమావేశాలు జరిపిందని, షెడ్యూల్ ప్రకారం మే 15న కాంగ్రెస్ పార్టీతో సమావేశం ఉండగా ఆ సమావేశాన్ని కాంగ్రెస్ రద్దు చేసుకున్నట్టు వివరించాయి.
ఎన్నికల కమిషన్పై రాహుల్ గాంధీ శనివారం నాడు విమర్శలు ఎక్కుపెట్టారు. తీవ్రమైన అంశాలపై ఈసీ జవాబులు దాటవేస్తోందని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్-ఫిక్సింగ్ జరిగిందని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం కావచ్చని పేర్కొన్నారు. మహారాష్ట్రతో సహా ఇటీవల అన్ని రాష్ట్రాల్లో జరిగిన లోక్సభ, విధానసభల సమగ్రమైన డిజిటల్, మెషీన్-రీడబుల్ ఓటర్ల జాబితాను ప్రచురించాలని, మహారాష్ట్ర పోలింగ్ బూత్ల్లోని సాయంత్రం 5 గంటల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.
సీసీటీవీ ఫుటేజ్పై...
మహారాష్ట్రలోని పోలింగ్ స్టేషన్లలో సాయంత్రం వేళ తీసిన సీసీటీవీ ఫుటేజ్ మాయమైందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈసీ వర్గాలు స్పందించాయి. ఈసీ ప్రోటోకాల్ ప్రకారం వాటిని భద్రపరుస్తారని, ఎన్నికల పిటిషన్ దాఖలైతే సంబంధిత హైకోర్టు దానిని పరిశీలిస్తుందని తెలిపారు. 'ఎన్నికల ప్రక్రియ సమగ్రత, ఓటర్ల ప్రైవసీ దృష్ట్యా ఇదంతా జరుగుతుంది. ఓటర్ల ప్రైవసీపై దాడి చేయాలని రాహుల్ గాంధీ ఎందుకనుకుంటున్నారు?. ఎలక్టోరల్ చట్టాలను పరిరక్షించడం ఈసీ బాధ్యత' అని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రిగ్గింగ్ ఆరోపణలపై చట్టపరమైన మార్గాలను అనుసరించవచ్చనీ ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
రాహుల్ గాంధీ రిగ్గింగ్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం
బీజేపీపై మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యలు.. రాహుల్ పోస్ట్
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి