Manoj Naravane: యుద్ధం అంటే..బాలీవుడ్ సినిమా కాదు
ABN , Publish Date - May 13 , 2025 | 05:00 AM
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై స్పందించిన మాజీ ఆర్మీ చీఫ్ నరవణె, యుద్ధం బాలీవుడ్ సినిమా కాదని, దౌత్యానికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యుద్ధం చివరి పరిష్కారంగా మాత్రమే ఉండాలని ఆయన సూచించారు.

దౌత్యానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి
ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణె వ్యాఖ్యలు
పుణె, మే 12: భారత్, పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అనేది రొమాంటిక్ లేదా బాలీవుడ్ సినిమా కాదన్నారు. పిల్లలతో సహా ప్రియమైన వారిని కోల్పోవాల్సి వస్తుందని, ఆ ఆవేదన తరతరాలు వెంటాడుతుందన్నారు. దౌత్యానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నరవణె కాల్పుల విరమణ ఒప్పందంపై మాట్లాడారు. ‘నాకు ఆదేశాలు వస్తే.. తప్పకుండా యుద్ధానికి వెళ్తా. కానీ, దౌత్యమార్గమే నా ప్రథమ ప్రాధాన్యంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. ‘యుద్ధం లేదా హింస ఏదైనా చివరి అవకాశంగా మాత్రమే ఉండాలి. అందుకే మన ప్రధాని ఇది యుద్ధాల యుగం కాదని చెబుతుంటారు. బుద్ధి లేని వ్యక్తులు మనపై యుద్ధాన్ని బలవంతంగా రుద్దినప్పటికీ, మనం దాని కోసం ఉత్సాహంగా ఉండకూడదు’ అని జనరల్ నరవణె అన్నారు.