Share News

Manipur Tension: మణిపూర్‌లో మళ్లీ మంటలు.. మైతేయి నాయకుల అరెస్టుతో ఉద్రిక్తత

ABN , Publish Date - Jun 08 , 2025 | 03:39 PM

అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఇంఫాల్‌లోని కావాకేథేల్, యురిపోక్‌లో రోడ్లపైకి వచ్చారు, టైర్లు, పాత సామగ్రికి నిప్పుపెట్టారు. దీంతో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

Manipur Tension: మణిపూర్‌లో మళ్లీ మంటలు.. మైతేయి నాయకుల అరెస్టుతో ఉద్రిక్తత

ఇంఫాల్: జాతుల వైరంతో కొద్దికాలంగా అట్టుడుకుతూ వచ్చిన మణిపూర్‌ (Manipur)లో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. మైతేయి సంస్థ అయిన అరాంబాయ్ టెంగోల్(Arambai Tengol)కు చెందిన పలువురు నేతలను అరెస్టు చేశారన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు చోట్ల నిరసనలు, హింసాత్మక ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఐదు జిల్లాలో ఇంటర్నెట్, మొబైల్ డేటా సర్వీసులను అధికార యంత్రాంగం నిలిపివేసింది. బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించింది.


అరెస్టు చేసిన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఇంఫాల్‌లోని కావాకేథేల్, యురిపోక్‌లో రోడ్లపైకి వచ్చారు. టైర్లు, పాత సామగ్రికి నిప్పుపెట్టారు. దీంతో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కావాకేథేల్ ఔట్‌పోస్టుపై ఆందోళనకారులు దాడికి దిగారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు జర్నలిస్టులు, ఒక పౌరుడు గాయపడ్డారు.


అరాంబాయ్ టెంగోల్‌కు చెందిన ఐదుగురు వలంటీర్లను ఎన్ఐఏ అరెస్టు చేసినట్టు వార్తలు రావడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఈ అరెస్టులను అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. నిరసనల నేపథ్యంలో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబల్, బిష్ణుపూర్, కాక్‌చింగ్ జిల్లాల్లో శనివారం రాత్రి 11.45 నుంచి ఐదు రోజులపాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా, వీఎస్ఏటీ, వీపీఎన్ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బిష్ణుపూర్ జిల్లాలో అయితే కర్ఫ్యూ సైతం విధించారు. శాంతి భద్రతల పరిస్థితి, సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయనే కారణంగా ఈ ఆంక్షలు విధిస్తున్నామని, వీటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోం శాఖ కమిషనర్ కమ్ సెక్రటరీ ఎన్.అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, నిరసనలు, ఆందోళనలు చోటుచేసుకున్న జిల్లాల్లో భద్రతా బలగాలను మోహరించగా.. అ్లలరిమూకను చెదరగొట్టేందుకు బలగాలు పలురౌండ్లు గాలిలో కాల్పులు జరిపారు. అల్లర్లు విస్తరించకుండా అదనపు బలగాలను మోహరించినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.


ఆరాంబాయ్ టెంగోల్ ఎవరు?

ఆరాంబాయ్ టెంగోల్ అనేది మణిపూర్ ప్రాంతంలో చురుకుగా ఉన్న మైతేయి యూత్ గ్రూప్. జాతుల ఘర్షణ సమయంలో కమ్యూనిటీ మొబిలైజేషన్‌లో కీలక భూమిక పోషించినట్టు చెబుతుంటారు. ఇటీవల చోటుచేసుకున్న అలజడుల్లో వీరి ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడం, వీరిలో కొందరిని అరెస్టు చేయడం తాజా ఉద్రిక్తతలకు కారణమవుతోంది.


ఇవి కూడా చదవండి..

బీజేపీకి యూట్యూబర్ మనీష్ కశ్యప్ గుడ్‌బై

జస్బీర్‌ ఫోన్‌లో 150 పాకిస్థాన్‌ కాంటాక్టులు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 08 , 2025 | 04:18 PM