Chandrasekaran: ఎయిర్ ఇండియా క్రాష్ గురించి టాటా సన్స్ ఛైర్మన్ కీలక హామీ
ABN , Publish Date - Jun 13 , 2025 | 07:11 PM
ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ (Chandrasekaran) మరోసారి స్పందించారు. దీనిని టాటా గ్రూప్ చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైన రోజుగా పేర్కొన్నారు. బాధితుల పట్ల తమ బాధ్యతను గుర్తు చేస్తూ, ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయిలో పారదర్శకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

అహ్మదాబాద్: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ (Chandrasekaran), మరోసారి స్పందించారు. టాటా గ్రూప్ చరిత్రలో ఇది అత్యంత అంధకారమైన రోజుల్లో ఒకటని అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు ఉద్యోగులకు పంపిన భావోద్వేగమైన లేఖలో, చంద్రశేఖరన్ తన బాధను వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తాము షాక్లో ఉన్నామని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇప్పటికే విచారణ బృందాలు..
దీంతోపాటు ఈ ఘటనపై తాము పూర్తి పారదర్శకంగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మాటలతో సాంత్వన ఇవ్వలేమని, కానీ ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని లేఖలో పేర్కొన్నారు. చంద్రశేఖరన్ తన సందేశంలో ఏమి తప్పు జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. భారతదేశం, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ నుంచి విచారణా బృందాలు అహ్మదాబాద్కు చేరుకున్నాయన్నారు. ఈ క్రమంలో టాటా గ్రూప్ పూర్తి సహకారం వారికి అందిస్తుందని ఆయన వెల్లడించారు.
శిక్షణ పొందిన వారే
మేము వాస్తవాలను నిర్ధారించిన తర్వాత, ఈ దుర్ఘటన ఎలా జరిగిందో పారదర్శకంగా చెబుతామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఊహాగానాల విషయంలో సహనం వహించాలని కోరారు. ఒక సాధారణ విమానం ఎందుకు ఇంత పెద్ద విపత్తుగా మారిందో తెలుసుకోవడానికి శిక్షణ పొందిన పరిశోధకులే నిర్ణయించగలరని పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా.. టాటా గ్రూప్నకు చెందింది. ఈ విమానయానాన్ని 2022 జనవరి 27న అధికారికంగా టాటా గ్రూప్ స్వాధీనం చేసుకుంది. ఇది 69 సంవత్సరాల తర్వాత జరిగింది. ఎయిర్ ఇండియా 1932లో JRD టాటాచే స్థాపించబడింది.
ప్రమాదం ఇలా..
అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లే బోయింగ్ 787 డ్రీమ్లైనర్ జూన్ 12న మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన వెంటనే క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 12 సిబ్బంది ఉన్నారు. టాటా గ్రూప్, ఇప్పటికే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. జూన్ 15 లాస్ట్ డేట్, లేదంటే..
For National News And Telugu News