Supreme Court Rahul Gandhi: గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:27 PM
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన గతంలో నిర్వహించిన భారత్ జోడో యాత్రలో చేసిన వ్యాఖ్యల గురించి ధర్మాసనం ప్రశ్నించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి (Supreme Court Rahul Gandhi) సుప్రీంకోర్టు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కారణం ఏంటంటే 2020 గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల గురించి రాహుల్ చేసిన కామెంట్స్. రాహుల్, తన భారత్ జోడో యాత్రలో చైనా 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని, ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని సరెండర్ చేశారని ఆరోపించారు. తాాజాగా ఆ మాటలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆధారాలు ఉన్నాయా..
దీనిపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మసీహ్ల బెంచ్ రాహుల్ని సీరియస్గా ప్రశ్నించింది. 2,000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనా తీసుకుందని మీరు ఎలా తెలుసుకున్నారని ప్రశ్నించింది?. మీరు నిజమైన భారతీయులైతే అలా మాట్లాడరు కదా? అని జస్టిస్ దత్తా అడిగారు. మీరు అక్కడ ఉన్నారా?, మీ దగ్గర ఏమైనా నమ్మదగిన ఆధారాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నలు సంధించారు.
అలా మాట్లాడకపోతే..
రాహుల్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ వాదించారు. రాహుల్ అలాంటి మాటలు చెప్పకపోతే, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎలా ఉంటారని సింఘ్వీ అన్నారు. దీనికి జస్టిస్ దత్తా మరి ఇలాంటివి పార్లమెంట్లో ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అయినా, ఈ కేసును కొట్టివేయాలన్న రాహుల్ విజ్ఞప్తిపై కోర్టు నోటీసు జారీ చేసింది. ఈ కేసు కొనసాగనుందని చెప్పింది.
ఇతర కోర్టుల్లో కూడా..
సింఘ్వీ, ఈ కేసులో కొన్ని తప్పులు జరిగాయని చెప్పారు. పోలీసులు రాహుల్కి ముందస్తు విచారణ అవకాశం ఇవ్వకుండానే కేసు నమోదు చేశారని వాదించారు. గతంలో, మే నెలలో అలహాబాద్ హైకోర్టు కూడా రాహుల్ పిటిషన్ను తిరస్కరించింది. లక్నోలో ప్రత్యేక కోర్టు రాహుల్కు ఫిబ్రవరిలో సమన్స్ జారీ చేసి, ఆయనపై విచారణకు ఆదేశించింది. హైకోర్టు జడ్జి సుభాష్.. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు అంటే సైన్యాన్ని అవమానించేలా మాట్లాడే హక్కు కాదని పేర్కొన్నారు.
గతంలో పలుమార్లు..
ఈ కేసు మొదట 2022 డిసెంబర్లో ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో బయటకొచ్చింది. సైన్యం గురించి రాహుల్ గాంధీ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. రాహుల్ మాత్రం ఈ ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపితమని చెప్పారు. రాహుల్ ఈ విషయాన్ని పలుమార్లు పునరావృతం చేశారు. 2023 జనవరిలో జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లోనూ, చైనా మన భూమిని ఆక్రమించిందన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని ఖండించింది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి