Sonia Gandhi: ఇజ్రాయెల్ దాడులపై మౌనమా?
ABN , Publish Date - Jun 22 , 2025 | 06:11 AM
ఇరాన్, గాజాలపై ఇజ్రాయెల్ విధ్వంసక దాడుల విషయంలో కేంద్రం మౌనం వహించిందంటూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ మండిపడ్డారు.

ఇది దేశ స్వరం కోల్పోవడమే.. విలువలు వదులుకున్నట్లే: సోనియా
న్యూఢిల్లీ, జూన్ 21: ఇరాన్, గాజాలపై ఇజ్రాయెల్ విధ్వంసక దాడుల విషయంలో కేంద్రం మౌనం వహించిందంటూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ మండిపడ్డారు. ఇది చూస్తే మన నౌతిక, దౌత్యపరమైన సంప్రదాయాల నుంచి నిష్క్రమించినట్లే అనిపిస్తోందని అన్నారు. ది హిందూ పత్రిక ప్రచురించిన ఆమె మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గాజాలోనూ, ఇరాన్పైన దాడుల విషయంలో మౌనం ‘దేశం స్వరం కోల్పోవడమే కాకుండా, విలువలు వదులుకున్నట్లే’ అని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్, పాలస్తీనా విషయంలో ద్వైపాక్షికంగా శాంతియుత పరిష్కారం సాధించాలన్న భారత దీర్ఘకాలిక సూత్రాన్ని మోదీ ప్రభుత్వం విడిచిపెట్టేసిందన్నారు.
దేశం గళం వినిపించడానికి ఇప్పటికీ సమయం మించిపోలేదని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించడానికి, చర్చలు పునరుద్ధరించడానికి ప్రతీ దౌత్య మార్గాన్ని వినియోగించుకోవాలని సలహా ఇచ్చారు. ఇరాన్పై ఇజ్రాయెల్ అన్యాయంగా దాడులకు దిగిందని, ఈ దాడులను కాంగ్రెస్ ఖండించిందన్నారు. 2023 అక్టోబరు 7న హమాస్ చేసిన దాడులను కూడా తమ పార్టీ వ్యతిరేకించిందని చెప్పారు. అయితే గాజాపై ఇజ్రాయెల్ తీవ్ర ప్రతిస్పందనను తాము సమర్ధించబోమన్నారు. పశ్చిమాసియాలో విధ్వంసక మార్గాన్ని అనుసరిస్తున్నారని ట్రంప్పైనా ఆమె ధ్వజమెత్తారు.