Share News

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్..

ABN , Publish Date - May 19 , 2025 | 03:14 PM

ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌పై దాడికి ముందే ఆ దేశానికి సమాచారం ఇవ్వడం నేరమని, భారత ప్రభుత్వం ఈ పని చేసిన విషయాన్ని విదేశాంగ మంత్రి బహిరంగంగానే అంగీకరించారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఫలితంగా ఎన్ని విమానాలను భారత్ కోల్పోయిందో చెప్పాలని ప్రశ్నించారు.

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్..

న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్‌ (S.Jaishankar)పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శల పర్వం కొనసాగుతోంది. ఆపరేషన్ సిందూర్‌ (Operataion) ప్రారంభించడానికి ముందే కేంద్రం ఆ సమాచారాన్ని పాక్‌కు తెలియజేయడం తప్పిదమే కాకుండా నేరమని అన్నారు. ''విదేశాంగ మంత్రి నిశ్శబ్దం కేవలం సమాచారాన్ని వెల్లడించడం కాదు, అది విపత్కరం'' అని రాహుల్ గాంధీ తాజా ట్వీట్‌లో పేర్కొన్నారు. గతంలో అడిగిన ప్రశ్ననే మళ్లీ అడుగుతున్నానని, పాకిస్థాన్‌కు ముందుగానే సమాచారం తెలిసినందు వల్ల మనం ఎన్ని విమానాలు కోల్పోయాం? ఇది తప్పిదం కాదు, నేరం. దేశానికి నిజం తెలియాలని ఆ ట్వీట్‌లో విదేశాంగ మంత్రిని రాహుల్ ప్రశ్నించారు. రాహుల్ విమర్శలపై బీజేపీ వెంటనే స్పందించింది. మంత్రి వ్యాఖ్యలను విపక్ష నేత వక్రీకరిస్తున్నారని, ఆయన ఇలాంటి ప్రశ్నలు వేస్తున్న సమయం చూస్తే దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారనే విషయం అవగతమవుతోందని తప్పుపట్టింది.

Golden Temple: గోల్డెన్ టెంపుల్ని టార్గెట్ చేసిన పాక్


జైశంకర్ మీడియాతో మాట్లాడినప్పటి వీడియోను రాహుల్ గాంధీ గత శనివారం నాడు షేర్ చేశారు. ''ఆపరేషన్ ప్రారంభంలో పాకిస్థాన్‌కు మెసేజ్ పంపాం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తామే కానీ మిలిటరీ మీద కాదని చెప్పాం. అందువల్ల మిలిటరీ ఈ విషయంలో జోక్యానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మంచి మాటలు చెవికెక్కని విధానాన్నే వాళ్లు ఎంచుకున్నారు'' అని చెబుతున్నట్టుగా ఉన్న వీడియోను రాహుల్ షేర్ చేశారు. దాడికి ముందే పాకిస్థాన్‌కు సమాచారం ఇవ్వడం నేరమని, భారత ప్రభుత్వం ఈ పని చేసిన విషయాన్ని విదేశాంగ మంత్రి బహిరంగంగానే అంగీకరించారని రాహుల్ పేర్కొన్నారు. ఫలితంగా ఎన్ని విమానాలను భారత్ కోల్పోయిందో చెప్పాలని ప్రశ్నించారు.


ఇదే వీడియోను రాహుల్ సోమవారం నాడు రీపోస్ట్ చేశారు. ''మరోసారి అడుగుతున్నాను. పాకిస్తాన్‌కు సమాచారం తెలియడం వల్ల మనం ఎన్ని విమానాలు కోల్పోయాం? ఇది తప్పుకాదు, నేరం. దేశం నిజం తెలుసుకోవాలనుకుంటోంది'' అని అన్నారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేర సైతం రాహుల్ ఆరోపణలను తిరిగి ప్రస్తావిస్తూ, పాక్‌కు ముందుగానే సమాచారం ఇవ్వడాన్ని ప్రశ్నించారు. విదేశాంగ మంత్రికి, పాకిస్థాన్‌కు మధ్య ఎలాంటి సంబంధం ఉందని నిలదీశారు. ఇది దౌత్యం కాదని, గూఢచర్యం అని అన్నారు. పాక్‌కు ముందే సమాచారం ఇచ్చామని జైశంకర్ చెప్పడం అందరికీ తెలుసని, ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఉగ్రశిబిరాలపై దాడి చేస్తామని ముందుగానే సమాచారం ఇవ్వడం వల్ల మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులు దాడుల నుంచి తప్పించుకున్నారా? అని ప్రశ్నించారు. దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి తప్పనిసరిగా సమాధానం చెప్పాలన్నారు.


విదేశాంగ శాఖ ఖండన..

కాగా, కేంద్రమంత్రి జైశంకర్ వ్యాఖ్యలను వక్రీకరించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. పాకిస్థాన్‌ను మొదట్లోనే హెచ్చరించామని ఈఏఎం చెప్పిందని, అంటే ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తర్వాత మొదట్లో ఆ మాట అన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోందని వివరించింది. కాగా, ఫ్యాక్ట్ చెక్ వింగ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సైతం ఈ వాదనను సమర్ధించింది. మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించారని వ్యాఖ్యానించింది. ఇలాంటి తప్పుడు సమాచారం నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.


విదేశాల్లో ఉన్నప్పుడు ఆరోపణలా?

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరచుకుపడింది. మంత్రి వ్యాఖ్యలను పదేపదే వక్రీకరిస్తున్నారని, కొన్ని శక్తుల తరఫున రాహుల్ పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని ఆ పార్టీ ప్రతినిధి తుహిన్ సిన్హా అన్నారు. మంత్రి విదేశాల్లో ఉన్నప్పుడు రాహుల్ గుచ్చిగుచ్చి ఇలాంటి ప్రశ్నలు వేయడం ఏమిటని నిలదీశారు. మన దౌత్య ప్రతినిధుల బృందాలు విదేశాలకు వెళ్తున్న తరుణంలో దేశానికి అపకీర్తి తెచ్చిపెట్టాలని రాహుల్ అనుకుంటున్నారని విమర్శించారు.


ఇవీ చదవండి:

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 04:18 PM