Shashi Tharoor: మూడో దేశం జోక్యమేం లేదు
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:42 AM
పాకిస్థాన్తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారంటూ.. ‘నరేందర్..

భారత్కు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు
రాహుల్ చేసిన ‘నరేందర్.. సరెండర్’ వ్యాఖ్యలను పరోక్షంగా తోసిపుచ్చిన శశిథరూర్
న్యూఢిల్లీ, జూన్ 5: పాకిస్థాన్తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారంటూ.. ‘నరేందర్.. సరెండర్’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ పరోక్షంగా తోసిపుచ్చారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ అంశంలో మూడో దేశం జోక్యమేదీ లేదని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తున్న తీరు, దానికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అంశాలను వివరించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న భారత అఖిలపక్ష బృందానికి శశిథరూర్ నేతృత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడారు. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు, మోదీ లొంగిపోయారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. ‘‘దాడులు ఆపాలని భారత్కు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాక్ ఆపితే మేం ఆపడానికి సిద్ధంగా ఉన్నామని మేం ముందే స్పష్టం చేశాం. ఒకవేళ వారు (ట్రంప్).. భారత్ దాడులు నిలిపేయడానికి సిద్ధంగా ఉందని, తొలుత మీరు ఆపాలని పాక్కు చెప్పి ఉంటే.. అదే వారు చేసిన గొప్ప పని..’’ అని శశిథరూర్ పేర్కొన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని వీడకపోతే.. తామేంటో చూపించడానికి భారత్ సిద్ధంగా ఉందని, ఇక్కడ మూడో వ్యక్తి అవసరమేమీ లేదన్నారు. కాగా, భారత ప్రతినిధి బృందంలోని మరో సభ్యుడు, ఎంపీ మిలింద్ దేవరా మాట్లాడుతూ.. ‘శశిథరూర్కు తన పార్టీ కంటే దేశమే ఎక్కువ’ అని పేర్కొన్నారు.