Ashoka University: అశోకా వర్సిటీ ప్రొఫెసర్ అలీఖాన్ తాత్కాలిక బెయిలు పొడిగింపు
ABN , Publish Date - May 28 , 2025 | 05:06 PM
ప్రొఫెసర్ అలీఖాన్ భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రసంగంపై ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే కేసు నమోదైనందున ఇందుకు సంబంధించి ఆన్లైన్లో ఎలాంటి పోస్టులు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై సోషల్ మీడియా పోస్టులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అశోకా యూనివర్సిటీ (Ashoka University) అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమూద్ తాత్కాలిక బెయిలును సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారంనాడు పొడిగించింది. సిట్ తన దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఈ అశంపై విచారణ సందర్భంగా బెంచ్ ఆదేశించింది. ప్రొఫెసర్ అలీఖాన్ భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రసంగంపై ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే కేసు నమోదైనందున ఇందుకు సంబంధించి ఆన్లైన్లో ఎలాంటి పోస్టులు చేయరాదని స్పష్టం చేసింది.
జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా కేసు గురించి చెప్పాలని హర్యానా పోలీసులను సుప్రీంకోర్టు సూచించింది. కాగా, ప్రొఫెసర్ అలీఖాన్పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు కావడంతో ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ను హర్యానా డీజీపీ శత్రుజిత్ కపూర్ గత వారంలో ఏర్పాటు చేశారు. అలీఖాన్కు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంతో ఆయన గత గురువారంనాడు జ్యుడిషియల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు.
దీనికి ముందు, ఆపరేషన్ సిందూర్పై సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి మే 18న హర్యానా పోలీసులు అలీఖాన్ను అరెస్టు చేశారు. మే 17, 18 తేదీల్లో రాయ్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. వచ్చే విచారణ తేదీనాటికి దర్యాప్తు నివేదికను సిట్ సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
ఇక భారత్ను చూసి పాక్ వణకాల్సిందే..
రాజ్యసభకు కమల్ హాసన్.. డీఎంకే అధికారిక ప్రకటన
Read Latest National News and Telugu News