Trains: ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్ బోగీల తగ్గింపు
ABN , Publish Date - Jun 05 , 2025 | 01:44 PM
పలు ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్ బోగీలు తగ్గించాలని దక్షిణ రైల్వే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశముంది. అలాగే బోగీల తగ్గింపు నిర్ణయంపై ఇప్పటికే పలు విమర్శలొస్తున్నాయి.

- పేద, మధ్య తరగతి ప్రయాణికుల అవస్థలు
చెన్నై: రాష్ట్రంలో నడుపుతున్న ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్ బోగీల సంఖ్య తగ్గించి, ఆదాయం పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ఎక్స్ప్రెస్ రైళ్లలో(Express Trains) ఏసీ బోగీలను పెంచేందుకు దక్షిణ రైల్వే తీసుకున్న నిర్ణయం వల్ల పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశముంది. రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి కుటంబాలకు చెందిన వ్యక్తులు దూర ప్రాంతాలకు వెళ్ళేందుకు రైళను మాత్రమే నమ్ముకున్నారు.
తక్కువ ఛార్జీలతో రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగీల్లో ప్రయాణించేందుకు సామాన్య ప్రజలు ఇష్టపడుతుంటారు. అదేవిధంగా ఎక్స్ప్రెస్ రైళ్లలో సెకండ్ క్లాస్ స్లీపర్ కోచ్లను తగ్గించి ఏసీ కోచ్ల సంఖ్య పెంచేందుకు దక్షిణ రైల్వే తీసుకున్న నిర్ణయం ఆగస్టు 2వ తేదీ నుండి అమలుకానుండటంపై పేద,మధ్య తరగతి ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఈ నిర్ణయం వల్ల నలుగురు వ్యక్తులు కలిగిన సామాన్య కుటుంబం ఇకనుంచి ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణం చేసేందుకు రూ.5వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. రైల్వేశాఖ ఇప్పటికే సేవా దృక్పథానికి దూరమైందని, కార్పొరేట్ సంస్థలకు ఈ శాఖలో భాగస్వామ్యం కల్పించిందని, సామాన్య ప్రయాణికుల సంక్షేమం గురించి రైల్వేశాఖ పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News