RCB: ఆర్సీబీ మేనేజర్ అరెస్టు
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:02 AM
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలిగొన్న తొక్కిసలాట కేసులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మార్కెటింగ్ మేనేజర్ నిఖిల్ సొసలెను పోలీసులు అరెస్టు చేశారు.

మరో ముగ్గురినీ అదుపులోకి...
సీఎం రాజకీయ కార్యదర్శికి ఉద్వాసన
ఇంటెలిజెన్స్ ఏడీజీపీపై బదిలీ వేటు
బెంగళూరు, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలిగొన్న తొక్కిసలాట కేసులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మార్కెటింగ్ మేనేజర్ నిఖిల్ సొసలెను పోలీసులు అరెస్టు చేశారు. సుమంత్, డీఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్కు చెందిన కిరణ్, సునిల్ మాథ్యూను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిఖిల్ సొసలె అరెస్టు సమయంలో నాటకీయ పరిణామాలు జరిగాయి. ఆయన ముంబై వెళ్లేందుకు భార్యతోపాటు విమానాశ్రయంలో ఉండగా పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి పట్టుకున్నారు. ఆ తర్వాత మిగతా ముగ్గురినీ అదుపులోకి తీసుకొన్నారు. వారిని విచారించారు. ఐపీఎల్ విజేత జట్టు అయిన ఆర్సీబీ కోసం బుధవారం బెంగళూరులో విజయోత్సవాలు జరుపుతున్నట్టు ప్రకటించింది ఎవరు.. పాస్ల మంజూరు, ఉచిత ప్రదేశాల గురించి ప్రచారం చేసింది ఎవరనేది పోలీసులు ఆరా తీశారు. అనంతరం ఆ నలుగురినీ బెంగళూరులోని బౌరింగ్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. కోర్టు ఎదుట వారిని హాజరుపరచగా, వారికి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నలుగురినీ పరప్పన అగ్రహార జైలుకు తరలించారు.
ఫిర్యాదు చేసిన అధికారే సస్పెండయ్యారు
ఆర్సీబీ మార్కెటింగ్ మేనేజర్ నిఖిల్ సొసలెకు హైకోర్టులో ఉపశమనం లభించలేదు. నిఖిల్ సొసలెను పోలీసులు అరెస్టు చేయడాన్ని ప్రశ్నిస్తూ ఆయన భార్య మాళవిక కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ‘మా రెండేళ్ల చిన్నారితో కలిసి నేను, నా భర్త ఎయిర్పోర్ట్లో ఉండగా ఆయనను అరెస్టు చేశారు. ఈ సమయంలో పోలీసులు మా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించారు. సీఎం సిద్దరామయ్య చెప్పారంటూ కనీస విచారణ లేకుండా, నోటీసులు ఇవ్వకుండా నా భర్తను అరెస్టు చేశారు’’ అని ఆ పిటిషన్లో తెలిపారు. శుక్రవారం కోర్టు ఈ పిటిషన్పై విచారణ జరిగింది. నిఖిల్ తరఫున సీనియర్ న్యాయవాది సందేశ్చౌట వాదనలు వినిపించారు. నిఖిల్ను శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అరెస్టు చేశారన్నారు. ఆయనపై ఫిర్యాదు చేసిన పోలీసు అధికారే సస్పెండ్ అయ్యారని కోర్టుకు వివరించారు. అరెస్టు చట్టపరంగా లేదని వాదించారు. సుదీర్ఘ వాదనల అనంతరం కేసును న్యాయమూర్తి ఈ నెల 9వ తేదీకి వాయిదా వేశారు. కాగా, తొక్కిసలాట ఘటనపై కబ్బన్పార్క్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
కొనసాగుతున్న వేట్లు..
తొక్కిసలాట ఘటనకు బాధ్యులుగా భావించిన మరికొందరిని సిద్దరామయ్య ప్రభుత్వం శుక్రవారం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై సకాలంలో స్పందించలేదంటూ ఇంటెలిజెన్స్ ఏడీజీపీ హేమంత్ నింబాల్కర్ను బదిలీ చేసింది. బెంగళూరు సీపీ, ఏసీపీ, డీసీపీలను ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సీఎం రాజకీయ కార్యదర్శి కె.గోవిందరాజు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ప్రొటోకాల్ పాటించలేదని, ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను సీఎం రాజకీయ కార్యదర్శి హోదా నుంచి తొలగించారు.
తప్పు ఆర్సీబీ, సర్కారులదే : కేఎ్ససీఏ
తొక్కిసలాట కేసులో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్కు (కేఎ్ససీఏ) హైకోర్టులో ఊరట లభించింది. అసోసియేషన్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అయితే.. కేసును రద్దు చేయడానికి మాత్రం నిరాకరించింది. ఈ కేసులో పోలీసులు అరెస్టులకు సిద్ధం కాగా, కేఎ్ససీఏ అధ్యక్షుడు రఘురాం భట్, కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఈఎస్ జయరాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి తరఫున శుక్రవారం హైకోర్టులో న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. స్టేడియం వద్ద చేరిన ప్రజలను నియంత్రించాల్సిన బాధ్యత ఆర్సీబీ, పోలీసులదేనని తెలిపారు. విధానసౌధ వద్ద సన్మాన కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారని తెలిపారు. కాగా, తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతల విషయంలో కనీస జాగ్రత్తలు అవసరం లేదా..? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం కేబినెట్ భేటీకి ముందే సిద్దరామయ్య తన ఆప్తులైన మంత్రులు జమీర్ అహ్మద్, శివానందపాటిల్, బైరతి సురేశ్లతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. సన్మాన ఏర్పాట్లు, ఇతర హడావుడికి డిప్యూటీ సీఎం శివకుమార్దే బాధ్యత అని ఆమంత్రులు తప్పుబట్టినట్లు తెలుస్తోంది.