Share News

ECI: రాహుల్ గాంధీ రిగ్గింగ్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం

ABN , Publish Date - Jun 07 , 2025 | 08:36 PM

2024 అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ నియామకం కోసం ప్యానల్ రిగ్గింగ్‌తో ప్రారంభించి అవకతవకల సాక్ష్యాలను దాచిపెట్టడంతో ఐదంచెల్లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యూహాన్ని బీజేపీ మహరాష్ట్రలో అనుసరించిందని అన్నారు.

ECI: రాహుల్ గాంధీ రిగ్గింగ్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యల్లో చిక్కుకున్నారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించేందుకు మ్యాచ్ ఫిక్సింగ్ వ్యూహాన్ని బీజేపీ అనుసరించిందని, త్వరలో జరుగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ పునరావృతం కానుందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ (ECI) ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, చట్ట పాలనను అవమానించడమేనని పేర్కొంది.


రాహుల్ దీనికి ముందు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ నియామకం కోసం ప్యానల్ రిగ్గింగ్‌తో ప్రారంభించి అవకతవకల సాక్ష్యాలను దాచిపెట్టడంతో ఐదంచెల్లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యూహాన్ని బీజేపీ మహరాష్ట్రలో అనుసరించిందని అన్నారు. వంచనకు పాల్పడిన వారు గెలవచ్చేమో కానీ ఇలాంటి పద్ధతుల వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడి, వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పోతుందని చెప్పారు.


రాహుల్ వ్యాఖ్యలపై అంతే వేగంగా ఎన్నికల కమిషన్ స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలు అసంబద్ధమని, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఒక ప్రకటనలో ఆక్షేపణ తెలిపింది. ఎన్నికల కమిషన్ డిసెంబర్ 2024న ఇందుకు సంబంధించిన వాస్తవాలను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు తెలియజేసిందని, దానిని ఈసీఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిందని తెలిపింది. సాక్ష్యాలు లేకుండా పదేపదే ఎవరు ఆరోపణలు చేసినా వారికి చట్టం పట్ల వారికి గౌరవం లేదనే అభిప్రాయానికి తావిస్తుందని, నిష్పాక్షిక ఎన్నికల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఎన్నికల సిబ్బంది నైతికస్థైరాన్ని దెబ్బతీస్తుందని ఘాటుగా విమర్శించింది.


బీజేపీ కౌంటర్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ బీహార్‌కు రాబోతోందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ వ్యాఖ్యలు హుందాగా లేవని, దేశ ప్రజాస్వామిక సంస్థలను బలహీనపరుస్తూ మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందని ఆ పార్టీ ప్రతినిధి తుహిన్ సిన్హా అన్నారు. రాహుల్ లేవనెత్తిన అంశాలకు ఎన్నికల కమిషన్ అనేక మార్లు వివరణ ఇచ్చిందని గుర్తు చేశారు.


ఇవి కూడా చదవండి..

బీజేపీపై మ్యాచ్ ఫిక్సింగ్‌ వ్యాఖ్యలు.. రాహుల్ పోస్ట్

కాళ్లబేరానికి పాకిస్థాన్..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 07 , 2025 | 08:37 PM