Businessman Shot Dead: ప్రముఖ వ్యాపారి కాల్చివేత.. శాంతిభద్రతలపై సీఎం సమీక్ష
ABN , Publish Date - Jul 05 , 2025 | 03:00 PM
ఘటన అనంతరం స్థానిక పోలీస్, పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. బైక్పై వచ్చిన అగంతకుడు ఈ కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పాట్నా సెంట్రల్ ఎస్పీ దీక్ష తెలిపారు.

పాట్నా: ప్రముఖ బీహార్ వ్యాపారి గోపాల్ ఖేమ్కాను అతని నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపడం కలకలం సృష్టించింది. బైక్ మీద వచ్చిన దుండగుడు ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు శనివారంనాడు తెలిపారు. శుక్రవారం రాత్రి 11.40 గంటలకు గాంధీ మైదాన్ ప్రాంతంలో ఈ హత్య జరిగినట్టు చెప్పారు.
ఘటన అనంతరం స్థానిక పోలీస్, పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. బైక్పై వచ్చిన అగంతకుడు ఈ కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పాట్నా సెంట్రల్ ఎస్పీ దీక్ష తెలిపారు. ఘటనా స్థలిలో బుల్లెట్ స్వాధీనం చేసుకున్నామని, సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తు్న్నామని చెప్పారు. కాగా, ఆరేళ్ల క్రితం ఖేమ్మా కుమారుడిని కూడా హజీపూర్లో క్రిమినల్స్ పొట్టనపెట్టుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం సమీక్ష
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారంనాడు సమీక్షించారు. బీహార్ డీజీపీ వినయ్ కుమార్, ఇతర పోలీసు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఖేమ్కా కాల్చివేత ఘటన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమాల్లో శాంతి భద్రతల పరిరక్షణ అనేది చాలా కీలకమని, నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని నితీష్ హెచ్చరించారు. ఖేమ్మా హత్య ఘటనపై సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖేమ్మాపై కాల్పులు జరిపిన 2 గంటల తర్వాత పోలీసులు ఘటనా స్థలికి వచ్చారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు డీజీపీ విజయ్కుమార్ తోసిపుచ్చారు. రాత్రి 11.40 గంటలకు కాల్పులు జరిగాయని, ఖేమ్నాను కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేర్చడానికి 30-35 నిమిషాలు పట్టిందని, ఆసుపత్రి అధికారులు సమాచారం ఇవ్వగానే 12.30 గంటలకు ఘటనా స్థలికి పోలీసు సిబ్బంది చేరుకున్నారని చెప్పారు. ఖేమ్కా హత్యకు వ్యాపారపరమైన శత్రుత్వం కారణం కావచ్చన్నారు.
తేజస్వి ఘాటు స్పందన
పాట్నాలోని పోలీస్ స్టేషన్కు కొద్ది దూరంలోనే ఖేమ్కాను దుండగులు కాల్చిచంపారని, బీహార్లో ప్రతినెలా వందలాది మంది వ్యాపారులు హత్యకు గురవుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తీవ్ర విమర్శలు చేశారు. ఇంత జరుగుతున్నా దీనిని ఆటవిక రాజ్యం అని ఎవరూ అనకుండా మీడియాను తమ వైపు తిప్పుకుని ప్రభుత్వ ఇమేజ్ పెంచుకునేందుకు తహతహలాడుతున్నారంటూ నితీష్ సర్కార్ను తప్పుపట్టారు.
ఇవి కూడా చదవండి..
మోదీ ఎమోషనల్ స్పీచ్.. ఈ కుర్చీ ప్రత్యేకత ఇదే!
ఢీకొన్న అమర్నాథ్ యాత్రికుల బస్సులు.. 36 మందికి గాయాలు..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి