PM Modi: మమత సర్కార్లో ఆడకూతుళ్లపై అకృత్యాలు.. నిప్పులు చెరిగిన మోదీ
ABN , Publish Date - Jul 18 , 2025 | 08:48 PM
దేశంలో చొరబాటుదారుల మార్గం సుగమం చేస్తు్న్నారని కూడా మమతా బెనర్జీ ప్రభుత్వా్న్ని మోదీ తప్పుపట్టారు. చొరబాటుదారులకు ఫేక్ డాక్యుమెంట్లు సమకూరుస్తున్నారని, ఇలాంటి వాళ్లతో రాష్ట్ర ఐడెంటికే ముప్పు తలెత్తుతుందని హెచ్చరించారు.

దుర్గాపూర్: పశ్చిమబెంగాల్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అధికార టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మా, మాటి, మనుష్' అంటూ ఒక పార్టీ మాట్లాడుతుంటుందని, కానీ మహిళలపై జరుగుతున్న అకృత్యాలు ఆవేదన, ఆక్రోశం కలిగిస్తున్నాయని అన్నారు. దుర్గాపూర్లో శుక్రవారంనాడు జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, మహిళా వైద్యురాలి హత్యాచారంతో ప్రమేయమున్న నిందితులను టీఎంసీ నేతలు రక్షణ కల్పిస్తున్నారని ఆర్జీ కర్ హాస్పిటల్ కేసును ప్రస్తావిస్తూ ఆరోపించారు.
'ఆ పార్టీ మా, మాటీ, మానుష్ అంటూ మాట్లాడుతుంది. అయితే వాళ్లు పాలిస్తున్న రాష్ట్రంలోని ఆడకూతుళ్లపై జరుగుతున్న ఘటనలు తీవ్ర వేదన కలిగిస్తున్నారు. ఆడకూతుళ్లకు ఆసుపత్రుల్లో కూడా రక్షణ ఉండటం లేదు. మహిళా వైద్యురాలిపై జరిగిన అకృత్యాలు అందరికీ తెలుసు. నిందితులను శిక్షించడానికి బదులు వారికి టీఎంసీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. మరో మహిళపై కూడా కాలేజీలో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. ఆ ఘటనకు టీఎంసీతో సంబంధాలున్నాయి. టీఎంసీలోని ప్రముఖ నేతలు, మంత్రులు నిందితులపై చర్యలు తీసుకోవడానికి బదులు బాధితులపై విమర్శలకు దిగుతున్నారు' అని మోదీ అన్నారు.
దేశంలో చొరబాటుదారుల మార్గం సుగమం చేస్తున్నారని కూడా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని మోదీ తప్పుపట్టారు. చొరబాటుదారులకు ఫేక్ డాక్యుమెంట్లు సమకూరుస్తున్నారని, ఇలాంటి వాళ్లతో రాష్ట్ర ఐడెంటికే ముప్పు తలెత్తుతుందని హెచ్చరించారు. బెంగాల్ ప్రతిష్ఠ బీజేపీకి కీలకమని, కానీ టీఎంసీ సొంత ప్రయోజనాల కోసం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతూ పశ్చిమబెంగాల్ ఉనికికే ముప్పు తెస్తోందని ఆరోపించారు.
టీఎంసీ గ్రహణం వీడితేనే..
వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను పరోక్షంగా మోదీ ప్రస్తావిస్తూ, టీఎంసీకి ఉద్వాసన చెబితేనే రాష్ట్రంలోని నిజమైన అభివృద్ధి సాధ్యమని అన్నారు. టీఎంసీ గోడ ఎప్పుడైతే కుప్పకూలుతుందో ఆ రోజు నుంచి బెంగాల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పారు. అప్పుడే నిజమైన మార్పు వస్తుందని తెలిపారు. పశ్చిమబెంగాల్లోని ప్రస్తుత సమస్యలను గుర్తించి.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలోనే లీడింగ్ ఇండస్ట్రియల్ హబ్లలో ఒకటిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని యువతకు ప్రధాని భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఏఐ విమాన ప్రమాదం మృతుల కోసం రూ.500 కోట్లతో టాటా ట్రస్ట్
చంగూర్ బాబా రెడ్ డైరీలో పలువురు పొలిటీషియన్ల పేర్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి