Share News

Chinab Bridge: చినాబ్‌ నదిపై ఇంజనీరింగ్‌ అద్భుతం

ABN , Publish Date - Jun 07 , 2025 | 05:39 AM

జమ్మూకశ్మీరులో చినాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే ఉక్కు వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జిని రూ.1,486 కోట్ల వ్యయంతో ఎనిమిదేళ్లపాటు శ్రమించి, నిర్మించారు.

Chinab Bridge: చినాబ్‌ నదిపై ఇంజనీరింగ్‌ అద్భుతం

  • ప్రపంచంలో ఎత్తైన రైలు బ్రిడ్జిని ప్రారంభించిన మోదీ

  • రూ.1486 కోట్లతో.. ఎనిమిదేళ్లలో నిర్మాణం

  • దేశంలోనే తొలి కేబుల్‌ రైలు వంతెన కూడా ప్రారంభం

  • రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానమైన కశ్మీరు

  • ఎవరెన్ని కుట్రలు చేసినా కశ్మీరులో అభివృద్ధి ఆపలేరు

  • పొరుగు దేశం మానవత్వానికి వ్యతిరేకం: మోదీ

కట్రా, జూన్‌ 6: జమ్మూకశ్మీరులో చినాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే ఉక్కు వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జిని రూ.1,486 కోట్ల వ్యయంతో ఎనిమిదేళ్లపాటు శ్రమించి, నిర్మించారు. అత్యంత దుర్లభమైన శివాలిక్‌, పీర్‌ పంజాల్‌ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్‌ లోయకు రైలును నడపాలన్న బ్రిటిష్‌ కాలం నాటి ప్రణాళిక దాదాపు శతాబ్దకాలం తర్వాత కార్యరూపం దాల్చింది. భారతదేశ ఇంజనీరింగ్‌ అద్భుతంగా పేర్కొంటున్న ఈ బ్రిడ్జిని శుక్రవారం మోదీ ప్రారంభించారు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని మోదీ ఈ అద్భుత వంతెనపై నడిచారు. కట్రా నుంచి కశ్మీరుకు వందే భారత్‌ రైలును జెండా ఊపి ప్రారంభించడంతో వంతెన అందుబాటులోకి వచ్చినట్లయింది. అలాగే అంజి నదిపై నిర్మించిన దేశంలోనే తొలి కేబుల్‌ రైలు వంతెనను కూడా మోదీ ప్రారంభించారు. దీంతో పాటు త్రికూట పర్వతాల్లోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్రికులకు బేస్‌ క్యాంపు అయిన కట్రాలో రూ.46 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని జమ్మూకశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఉధంపుర్‌లోని వైమానిక కేంద్రంలో దిగిన మోదీ.. వంతెన ప్రారంభానికి ముందు దాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చినాబ్‌, అంజి వంతెనలపై పరుగులు తీసిన వందేభారత్‌ రైలులో మోదీ ప్రయాణించారు. అనంతరం కట్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చినాబ్‌ వంతెన ప్రారంభోత్సవం జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి ప్రతిబింబమని చెప్పారు. ఉధంపూర్‌- శ్రీనగర్‌- బారాముల్లా రైలు లింకు (యూఎ్‌సబీఆర్‌ఎల్‌) ప్రాజెక్టు నవీన, సాధికార జమ్మూకశ్మీరుకు సంకేతమని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తవడంతో దేశంలోని అన్ని ప్రాంతాలతో కశ్మీరుకు రైలు అనుసంధానం ఏర్పడిందన్నారు.


కశ్మీరులో అభివృద్ధిని ఎవరూ ఆపలేరు..

ఎవరెన్ని కుట్రలు పన్నినా కశ్మీరులో అభివృద్ధిని ఆపలేరని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రస్తావించారు. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పామన్నారు. ‘‘మన పొరుగు దేశం పర్యాటకానికి, మానవత్వానికి వ్యతిరేకం. మన పర్యాటకాన్ని దెబ్బతీసి, పేదల పొట్టగొట్టాలని చూస్తోంది. ఆదిల్‌ హుస్సేన్‌ గుర్రం మీద పర్యాటకులను తీసుకెళ్లే పోనీవాలా. కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకునే ఆదిల్‌ ఆ రోజు (ఏప్రిల్‌ 22న) ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడాడు. అతడ్ని కూడా ముష్కరులు చంపేశారు. ఉగ్రవాదంపై పోరులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పాక్‌ ఉగ్ర కుట్రలకు దీటుగా బదులిస్తున్నాం. కశ్మీరులో పర్యాటకాన్ని నాశనం చేయాలని, దేశంలో మత ఘర్షణలు సృష్టించాలనే ఉగ్రవాదులు పహల్గాంలో దాడికి పాల్పడ్డారు. ఆపరేషన్‌ సిందూర్‌తో మన సత్తా ఏంటో వారికి చూపించాం’’ అని మోదీ పునరుద్ఘాటించారు.


చినాబ్‌ వంతెన.. ఒమర్‌ చిన్ననాటి కల

‘‘ఈఫిల్‌ టవర్‌ కన్నా ఎత్తయిన వంతెనను నిర్మించుకున్నాం. భారత ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి చినాబ్‌ బ్రిడ్జి నిలువెత్తు నిదర్శనం. ఈ వంతెన నిర్మాణంతో ఈ ప్రాంతం పర్యాటక ఆకర్షణగానూ నిలుస్తుంది. ఎన్నో సవాళ్లు ఎదురైనా మాతా వైష్ణోదేవి ఆశీర్వాదంతో విజయవంతంగా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశాం. ఈ రోజు భారత రైల్వే నెట్‌వర్క్‌తో కశ్మీర్‌ కూడా అనుసంధానమైంది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి.. అనేమాట నిజమైంది. ఈ రోజు కోసం అనేక తరాలు ఎదురుచూశాయి. సీఎం ఒమర్‌ అబ్దుల్లా కూడా 8వ తరగతి నుంచే ఈ ప్రాజెక్ట్‌ కోసం కలలు కన్నారు’’ అని మోదీ తెలిపారు. ఇదే సభలో జమ్మూకశ్మీరు సీఎం ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ.. కశ్మీరుకు ప్రత్యేక రాష్ట్ర హోదా అంశాన్ని తనదైన శైలిలో ప్రస్తావించారు. చతురతతో ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాని మోదీ తనను త్వరలోనే ప్రమోట్‌ చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘‘2014లో మీరు తొలిసారి ప్రధాని హోదాలో ఇక్కడికి వచ్చినప్పుడు నేను రాష్ట్రానికి సీఎంగా ఉన్నా. ఆ తర్వాత మీరు వరసగా గెలిచి ప్రధానిగా ఉన్నారు. నేను ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంత సీఎంగా డిమోట్‌ అయ్యాను. అప్పుడు రైల్వేశాఖ సహాయమంత్రిగా ఉన్న మనోజ్‌ సిన్హాకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పదోన్నతి వచ్చింది. త్వరలో నాక్కూడా ప్రమోషన్‌ వస్తుందని ఆశిస్తున్నా. జమ్మూకశ్మీరుకు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి ఎక్కువ సమయం పట్టదనుకుంటున్నా’’ అని ఒమర్‌ పేర్కొన్నారు. తాను 8వ తరగతిలో ఉన్నప్పుడు చినాబ్‌ రైలు వంతెన గురించి కలలు కన్నానని.. ఇప్పుడు తనకు 55 ఏళ్లని, తన పిల్లలు కూడా కాలేజీ చదువు పూర్తి చేశారని ఒమర్‌ చెప్పారు. బ్రిటిషర్లు కూడా పూర్తి చేయలేకపోయిన ఈ ప్రాజెక్టును ఎట్టకేలకు మోదీ సర్కారు పూర్తి చేసిందని కొనియాడారు.


చినాబ్‌ వంతెన ప్రత్యేకతలివీ..

చినాబ్‌ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఈ రైలు ఆర్చి వంతెనను నిర్మించారు. దీని పొడవు 1.315 కిలోమీటర్లు. ఇప్పటివరకు చైనాలో ఉన్న షుబాయ్‌ రైల్వే వంతెన (275 మీటర్ల ఎత్తు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును చినాబ్‌ వంతెన అధిగమించింది. పారి్‌సలోని ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 35 మీటర్లు ఎక్కువ. అతివేగమైన గాలులు, భూకంపాలు, వరదలు, బాంబు పేలుళ్లను సైతం తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. దీని ప్రారంభంతో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు ప్రయాణ సమయం దాదాపు 2-3 గంటలు తగ్గనుంది. ఈ వంతెన జీవితకాలం 120 ఏళ్లని ఇంజనీర్లు చెబుతున్నారు. దీనిపై గరిష్ఠంగా 100 కి.మీ. వేగంతో రైలు ప్రయాణించవచ్చు. ఈ వంతెన నిర్మాణంలో భాగంగా 600 కిలోమీటర్ల స్టీల్‌ వెల్డింగ్‌ను వినియోగించారు. ఇది ఢిల్లీ-జమ్ము మధ్య రైల్వే మార్గం పొడవుతో సమానం. 2002లో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలో ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేయగా.. 23 ఏళ్ల తర్వాత ఇది పూర్తయింది. వంతెనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Updated Date - Jun 07 , 2025 | 05:39 AM