Pahalgam: పాకిస్థాన్కు పెద్ద దెబ్బే
ABN , Publish Date - May 11 , 2025 | 03:27 AM
పహల్గాంలో జేష్-ఎ-మహమ్మద్(జేఈఎం) అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్) చేసిన మారణకాండకు దాయాది దేశం పాకిస్థాన్ భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

సింధూ జలాల ఒప్పందం రద్దు
పాక్ జాతీయులకు వీసాల తిరస్కరణ
ఎగుమతులు/దిగుమతులపై నిషేధం
పాక్ నౌకలకు భారత పోర్టుల్లోకి నో ఎంట్రీ
పీవోకేలోని ఉగ్రవాద శిబిరాల ధ్వంసం
బలూచిస్థాన్పైనా కోల్పోయిన పట్టు!
(సెంట్రల్ డెస్క్): పహల్గాంలో జేష్-ఎ-మహమ్మద్(జేఈఎం) అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్) చేసిన మారణకాండకు దాయాది దేశం పాకిస్థాన్ భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్కు చావు తప్పి.. కన్ను లొట్టపోయినంత పనైంది. పహల్గాం దాడి జరిగిన నాటి(ఏప్రిల్ 22) నుంచి.. శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ప్రకటన వరకు పాకిస్థాన్కు జరిగిన నష్టంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
సింధు జలాలు దూరం
పహల్గాంలో ఉగ్రవాదుల మారణకాండ జరిగిన తర్వాతి రోజే.. పాకిస్థాన్పై చర్యలకు భారత్ సిద్ధమైంది. గత నెల 23న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. భారత్లో ఉంటున్న పాక్ పౌరుల వీసాలను తక్షణం రద్దు చేసింది. పాకిస్థాన్తో వాణిజ్యాన్ని నిలిపివేసి, ఎగుమతులు/దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిర్ణయాలతో.. పాక్ జీడీపీకి 25ు వాటాను అందిస్తున్న సింధ్, పంజాబ్ రాష్ట్ర వ్యవసాయం కుంటుపడిపోనుంది.
‘ఆపరేషన్ సిందూర్’తో అతలాకుతలం
ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి దాటాక.. అంటే.. 7వ తేదీ తెల్లవారుజామున భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించి, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే), పాకిస్థాన్లోని పంజాబ్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను తుత్తునియలు చేసింది. ఈ దాడుల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 70 మంది మరణించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత.. ఆ సంఖ్య 100కు పెరిగినట్లు వివరించింది. ఆ మర్నాడు(8వ తేదీ) భారత్లోని వైమానిక స్థావరాలను టార్గెట్గా చేసుకుని పాక్ క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది. దీన్ని భారత్ అడ్డుకుని, పాకిస్థాన్లోని 4 ఎయిర్ డిఫెన్స్ సైట్లను డ్రోన్లతో ధ్వంసం చేసింది. లాహోర్, కరాచీ, రావల్పిండిలోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ధ్వంసమవ్వగా.. రావల్పిండిలో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ క్రికెట్ మ్యాచులు రద్దయ్యాయి. శుక్రవారం కూడా పాకిస్థాన్ను టార్గెట్గా చేసుకుని, భారత్ క్షిపణిదాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో నూర్ఖాన్ ఎయిర్బే్సకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం ఉదయం కూడా..8 వైమానిక స్థావరాలపై దాడి చేసినట్లు భారత్ ప్రకటించగా.. సాయంత్రానికి ఇరువైపుల నుంచి కాల్పుల విరమణ ప్రకటనలు వచ్చాయి. భారత్ దాడుల కారణంగా.. పాక్ తన విస్తీర్ణంలో 44ు ఉన్న బలూచిస్థాన్పైనా పట్టు కోల్పోయే పరిస్థితి నెలకొంది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) గురు, శుక్ర వారాల్లో పాక్ సైన్యాన్ని తరిమికొట్టి, క్వెట్టా సహా పలు నగరాలపై బీఎల్ఏ పట్టు సాధించింది.