PM Modi Bihar Tour: రూ.48,520 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం
ABN , Publish Date - May 30 , 2025 | 01:36 PM
బిహార్ లో రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ రూ.50వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కరకట్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అనేక విషయాలపై ప్రసంగించారు.

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ సహా మొత్తం ప్రపంచం భారతదేశ కుమార్తెల సిందూర శక్తిని చూశాయని ప్రధాని మోదీ అన్నారు. బిహార్ కరకట్లో ప్రధాని రూ.48,520 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో BSF శౌర్యం, ధైర్యాన్ని ప్రపంచం చూసిందని మోదీ చెప్పారు. మాతృభూమికి సేవ చేయడమనే పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, మే 10న సరిహద్దులో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ తన ప్రాణాలను అర్పించారని మోదీ కొనియాడారు. ఈ బిహార్ కుమారునికి గౌరవపూర్వక నివాళి అర్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
'ఆపరేషన్ సిందూర్ శక్తిని శత్రువు చూశాడు. ఇది మన అంబులపొదిలో ఉన్న ఒక బాణం మాత్రమే అని వారు అర్థం చేసుకోవాలి. ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటం ఆగలేదు. ఉగ్రవాదం మళ్లీ తలెత్తితే, అది ఏ కలుగులో దాక్కున్నా.. భారతదేశం బయటకు లాగి అణచివేస్తుంది" అని ప్రధాని అన్నారు.
మావోయిస్ట్ హింస పూర్తిగా నిర్మూలిస్తాం
గడిచిన సంవత్సరాల్లో హింస, అశాంతిని వ్యాప్తి చేసే వారిని మనం ఎలా నిర్మూలించామన్న దానికి బిహార్ ప్రజలే ప్రత్యక్ష సాక్షులని ప్రధాని మోదీ అన్నారు. 'కొన్నేళ్ల క్రితం ససారాం, దాని సమీప జిల్లాల్లో నక్సలిజం ఎంత ప్రబలంగా ఉండేదన్న విషయాన్ని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. మావోలకు బాబాసాహెబ్ అంబేద్కర్పై నమ్మకం లేదు. అటువంటి సంక్లిష్ట పరిస్థితులలో కూడా, సీఎం నితీష్ కుమార్ ఇక్కడ అభివృద్ధి కోసం తన వంతు ప్రయత్నం చేశారు. 2014కి ముందు 75కి పైగా జిల్లాలు నక్సల్ ప్రభావితమైనవి. ఇప్పుడు వాటి సంఖ్య కేవలం 18 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. మావోయిస్టు హింస పూర్తిగా నిర్మూలించబడే రోజు ఎంతో దూరంలో లేదు" అని మోదీ అన్నారు.
కరకట్లో రూ.48,520 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (శుక్రవారం) బిహార్లోని కరకట్లో రూ.48,520 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. నిన్న బిహార్ కు రెండ్రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన ప్రధాని మోదీ.. ఇవాళ NH–22లోని పట్నా–గయా–దోభి సెక్షన్ను నాలుగు లేన్లుగా మార్చడం, NH–27లోని గోపాల్గంజ్ టౌన్లో దాదాపు రూ.5,520 కోట్ల విలువైన ఎలివేటెడ్ హైవే.. గ్రేడ్ మెరుగుదలను మోదీ ప్రారంభించారు. వీటితోపాటు, సోన్ నగర్- మహ్మద్ గంజ్ మధ్య రూ.1,330 కోట్లతో నిర్మించిన మూడో రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు.
బిహార్, ఇంకా తూర్పు భారతదేశానికి ఇంధన భద్రతను చేకూర్చే లక్ష్యంతో ఔరంగాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన రూ.29,930 కోట్లకు పైగా విలువైన నబీనగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్-II (3x800 MW)కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
ఇంకా, ఈ ప్రాంతంలో రోడ్డు మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని బలోపేతం చేస్తూ, ప్రధానమంత్రి వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు, వీటిలో NH-119A లోని పాట్నా-అర్రా-ససారాం సెక్షన్ను నాలుగు లేన్లుగా విస్తరించడం, వారణాసి-రాంచీ-కోల్కతా హైవే (NH-319B), రాంనగర్-కచ్చి దర్గా స్ట్రెచ్ (NH-119D)ను ఆరు లేన్లుగా విస్తరించడం.. బక్సర్, భరౌలి మధ్య గంగా నదిపై కొత్త వంతెన నిర్మాణం ఉన్నాయి.
బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రులు, అనేక మంది ప్రముఖులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.