P Chidambaram: ఇండీ కూటమికి భవిష్యత్ లేదు!
ABN , Publish Date - May 17 , 2025 | 05:05 AM
ప్రతిపక్ష ‘ఇండీ కూటమి’ భవిష్యత్ ఏమంత ఉజ్వలంగా లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

బీజేపీకి దృఢమైన యంత్రాంగం ఉంది: పి.చిదంబరం
న్యూఢిల్లీ, మే 16: ప్రతిపక్ష ‘ఇండీ కూటమి’ భవిష్యత్ ఏమంత ఉజ్వలంగా లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పైగా బీజేపీకి శక్తిమంతమైన యంత్రాంగం ఉందని, అది ఆషామాషీ రాజకీయ పార్టీ కాదని.. అన్ని వైపుల నుంచీ దానిని ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపారు. త్వరలో జరిగే బిహార్, బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్తో కలిసి మృత్యుంజయ్సింగ్ యాదవ్ రాసిన ‘కంటెస్టింగ్ డెమోక్రాటిక్ డెఫిసిట్’ అనే పుస్తకాన్ని చిదంబరం గురువారం ఢిల్లీలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇండీ కూటమి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని మృత్యుంజయ్సింగ్ చెబుతున్నా.. నాకైతే అలా అనిపించడం లేదు. దాని భవిష్యత్ ఉజ్వలంగా లేదు. బహుశా సల్మాన్ దీనికి జవాబు చెప్పగలరు. ఎందుకంటే కూటమి చర్చల బృందంలో ఆయన కూడా భాగస్వామి. నిజంగా కూటమి ఐకమత్యంతో ఉంటే నేనెంతగానో సంతోషిస్తా. కానీ అది చాలా బలహీనంగా ఉంది. అయితే దానిని ఒక్కటిగా కూర్చవచ్చు. ఇంకా సమయం ఉంది’ అని చెప్పారు. అయితే కాంగ్రెస్, ఇతర పార్టీలు బీజేపీని ఆషామాషీగా తీసుకోకూడదన్నారు. ‘బీజేపీ అంత సంఘటితమైన, బలోపేతమైన పార్టీ లేదు. ప్రతి విభాగంలో పటిష్ఠంగా ఉంది. అది సాధారణ పార్టీ కాదు’ అని హెచ్చరించారు. చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తంచేశారు. ఆయన వంటి రాహుల్గాంధీ సన్నిహితులకు కూడా కాంగ్రె్సకు భవితవ్యం లేదని తెలుసంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ‘ఎక్స్’లో వ్యగ్యాంస్త్రాలు సంధించారు.