Pahalgam Return: అదీ.. భారత్ దమ్ము.. పహల్గాంలో ఆశ్చర్యకర దృశ్యం
ABN , Publish Date - Apr 28 , 2025 | 02:43 PM
భారతీయులు తామేంటో చూపిస్తే, విదేశీయులు భారత్ పై ఉన్న నమ్మకాన్ని అణువంత కూడా సడలించుకోలేదు. భారత సర్కారుపై ఉన్న అచంచల విశ్వాసం.. వాళ్ల నడక, నడవడికలో కనిపిస్తున్నాయ్..

Tourists return to Pahalgam: 26 మంది ప్రాణాలను బలిగొన్న విధ్వంసకర ఉగ్రవాద దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత పహల్గాంలో ఎవ్వరూ ఊహించని దృశ్యం ఆవిష్కృతమైంది. భారీ సంఖ్యలో పర్యాటకులు, జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం లోయకు చేరుకుంటున్నారు. అక్కడ క్రమంగా టూరిస్టుల సంఖ్య సాధారణ స్థితికి చేరుకుంటోంది. మునుపటితో పోలిస్తే, పర్యాటకుల సంఖ్య కొంత తగ్గినప్పటికీ, ఈ ప్రాంతం మరోసారి దేశీయ, అంతర్జాతీయ సందర్శకులతో అలరారుతుండటం విశేషం.
కోల్కతా, బెంగళూరు నుండి వచ్చిన సందర్శకులను పలుకరించినపుడు జమ్ముకశ్మీర్ యొక్క భద్రతపై విశ్వాసం వ్యక్తం చేశారు. కొంచెం ఆందోళన ఉన్నప్పటికీ, చాలా మంది పహల్గాం సందర్శనతో సహా వారి టూర్ ప్లాన్ ప్రకారమే ముందుకు సాగుతున్నారు.
"కాశ్మీర్ ఇప్పుడు సురక్షితంగా ఉంది, ప్రతి దుకాణం, టూరిస్ట్ సేవలు తెరిచే ఉన్నాయి. పర్యాటకులు సురక్షితంగా ఉన్నారు. అందరూ వస్తున్నారు కాబట్టి మీరు కూడా ఎలాంటి భయం లేకుండా దయచేసి రండి" అని కోల్కతా కు చెందిన ఒక పర్యాటకుడు కిక్కిరిసిన వ్యాన్ పక్కన నిలబడి అరుస్తూ కనిపించడం తాజా పరిస్థితికి అద్ధం పడుతోంది. గుజరాత్లోని సూరత్కు చెందిన టూరిస్ట్ మహ్మద్ అనాస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
“ఆందోళన చెందడానికి ఏమీ లేదు. సైన్యం, ప్రభుత్వం, స్థానికులు మాతో ఉన్నారు. మా భద్రతకు అండగా ఉంటున్నారు. దుర్ఘటన తర్వాత మేము భయపడ్డాం, వెంటనే వెనక్కి బయలుదేరాలని అనుకున్నాము. కానీ స్థానికులు, సైన్యం మమ్మల్ని ప్రేరేపించారు. అందుకే మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం” అని మహ్మద్ అనాస్ అన్నారు.
దాడి తర్వాత తాము భయపడలేదని.. అసౌకర్యంగా కూడా భావించలేదని విదేశీ పౌరులు అంటున్నారు. తరచుగా వచ్చే సందర్శకులు కూడా ఇక్కడ అంతా బాగానే ఉందని చెబుతున్నారు.