Rekha Gupta: 140 కోట్ల భారతీయుల గురించి తండ్రికి తెలియదా.. సీఎం స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - May 14 , 2025 | 09:23 PM
అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటారని, అప్పుడు యావద్దేశం సాయుధ బలగాలకు అండగా నిలుస్తుందని ఢిల్లీ సీఎం రేఖాగుప్తా అన్నారు.

న్యూఢిల్లీ: జాతీయ భద్రతపై కేంద్రాన్ని కానీ, సాయుధ బలగాలను కానీ ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ ఉండదని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా(Rekha Gupta) అన్నారు. తన దేశం, కుటుంబం, 140 కోట్ల మంది ప్రజల గురించి ఒక్క తండ్రికే బాగా తెలుస్తుందని అన్నారు. కాల్పుల విరమణను నిలిపివేయాలని ఇండియా-పాక్ నిర్ణయం తీసుకోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆమ్ ఆద్మీ పార్టీ అంతకుముందు విమర్శించింది. ఈ నిర్ణయానికి దారితీసిన కారణం ఏమిటి? పహల్గాం ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరిగిందా? అని ప్రశ్నించింది. దీనిపై బుధవారంనాడు ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రేఖాగుప్తా ఘాటు సమాధానం ఇచ్చారు.
అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటారని, అప్పుడు యావద్దేశం సాయుధ బలగాలకు అండగా నిలుస్తుందని రేఖాగుప్తా అన్నారు. ''ఏసీ గదుల్లో టీవీల దగ్గర కూర్చుని ఎవరైనా, ఏదైనా మాట్లాడవచ్చు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఎవరైతే నిలబడతారో వాళ్లే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తన కుటుంబం, దేశం, 140 కోట్ల ప్రజల గురించి ఒక తండ్రి ఆలోచిస్తారు. కేవలం ప్రకటనలు చేస్తే ప్రయోజనం ఉండదు. ప్రభుత్వాన్ని కానీ, సాయుధ బలగాలను కానీ ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ లేదు'' అని సీఎం అన్నారు.
పహల్గాం టెర్రరిస్టులను పట్టుకున్నారా?
దీనికి ముందు, పహల్గాం అనంతర పరిణామాలపై ఆప్ నేత, మాజీ ముఖ్యమంత్రి అతిషి సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆపరేషన్ సిందూర్తో సాయుధ బలగాలు తమ ధైర్యాన్ని చాటిచెప్పాయని, అయితే మే10న ట్రంప్ ప్రకటన తర్వాత కాల్పుల విరమణను ప్రభుత్వం ధ్రువీకరించిందని అన్నారు. పహల్గాం ఉగ్రవాదులను పట్టుకున్నారా లేదా అనే విషయాన్ని దేశం తెలుసుకోవాలని అనుకుంటోందని చెప్పారు. కాగా, అకస్మాత్తుగా కాల్పుల విరమణ ప్రకటన వెనుక ఏం మతలబు జరిగిందో చెప్పాలని ఆప్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా డిమాండ్ చేశారు.