No Aadhaar No Tatkal Tickets: ఆధార్ లేకుండా ఇకపై తత్కాల్ టికెట్ బుకింగ్స్ బంద్ .. రైల్వే కొత్త రూల్స్
ABN , Publish Date - Jul 17 , 2025 | 02:58 PM
రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్. ఇకపై టికెట్ బుకింగ్ చేయడం అంత ఈజీ కాదు. ప్రధానంగా తత్కాల్ టికెట్ల విషయంలో అనధికారికంగా టికెట్లు బుక్ చేయడాన్ని నిరోధించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 15 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ చేసే ముందు ఆధార్ ఆధారిత ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు.

భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్ వచ్చింది మీకు తెలుసా. ఎందుకంటే ఇకపై ఎవరు పడితే వారు టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం లేదు. తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీ (OTP) వెరిఫికేషన్ తప్పనిసరి (No Aadhaar No Tatkal Tickets) చేశారు. ఈ కొత్త రూల్ జూలై 15 నుంచి అమలులోకి వచ్చింది. ఈ మార్పు గురించి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఈ కొత్త రూల్ ప్రకారం తత్కాల్ టికెట్ల దుర్వినియోగాన్ని కట్టడిచేయడానికి, సామాన్య ప్రయాణికులకు అవకాశం కల్పించడానికి ఉద్దేశించబడింది.
ఈ కొత్త రూల్ ఎందుకో తెలుసా..
తత్కాల్ టికెట్లను ఇది వరకు పలువురు ఏజెంట్లు భారీ సంఖ్యలో బుక్ చేస్తూ సామాన్య ప్రయాణికులకు అందుబాటులో లేకుండా చేశారు. అవే టిక్కెట్లను ప్రైవేటు మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుని దోచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే శాఖ నిబంధనలను కఠినతరం చేసింది. ఆధార్ ఆధారిత ఓటీపీ వెరిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఇకపై తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ధృవీకరించాల్సి ఉంటుంది. మొబైల్ ఓటీపీ ధృవీకరణ లేకుండా తత్కాల్ టికెట్లు బుక్ చేయడం సాధ్యం కాదు. ఈ రూల్ ఆన్లైన్లో IRCTC వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా రైల్వే PRS కౌంటర్లలో టికెట్లు బుక్ చేసినప్పుడు వర్తిస్తుంది.
ఈ విధానం ఎలా పని చేస్తుంది?
తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి కొన్ని సులభమైన దశలను పాటించాలి.
టికెట్ బుకింగ్ సమయంలో మీ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ను నమోదు చేయాలి
ఆ తర్వాత రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ నుంచి మీ మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి
బుకింగ్ సమయంలో ఆధార్తో లింక్ అయిన మొబైల్ మీ వద్ద ఉండాలి
ఈ ధృవీకరణ పూర్తి చేయకపోతే, మీ తత్కాల్ టికెట్ బుకింగ్ విఫలమవుతుంది
ఏజెంట్లకు అనుమతి లేదు
సామాన్య ప్రయాణికులకు మరింత అవకాశం కల్పించేందుకు, తత్కాల్ బుకింగ్ విండో తెరిచిన మొదటి 30 నిమిషాల్లో ఏజెంట్లు టికెట్లు బుక్ చేయడాన్ని రైల్వే శాఖ నిషేధించింది
ఏసీ క్లాస్: ఉదయం 10:00 నుంచి 10:30 వరకు ఏజెంట్లకు బుకింగ్ అనుమతి లేదు
నాన్-ఏసీ క్లాస్: ఉదయం 11:00 నుంచి 11:30 వరకు ఏజెంట్లకు అనుమతి లేదు
ఈ నియమం వల్ల సామాన్య ప్రయాణికులకు తత్కాల్ టికెట్లు ఈజీగా దొరికే అవకాశం ఉంది.
ప్రయాణికులు ఏం చేయాలి?
మీ IRCTC ఖాతాకు మీ ఆధార్ నంబర్ను యాడ్ చేయండి. ఇది బుకింగ్ సమయంలో సమస్యలను నివారిస్తుంది.
బుకింగ్ సమయంలో ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ మీ వద్ద ఉండేలా చూసుకోండి
తత్కాల్ బుకింగ్ తెరిచిన తొలి అరగంటలో ఏజెంట్ల ద్వారా బుక్ చేయడం మానుకోండి.
మరిన్ని వివరాల కోసం IRCTC వెబ్సైట్ను (www.irctc.co.in) సందర్శించండి
ఇవి కూడా చదవండి
యూట్యూబ్లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి