Nitish Kumar: బిహార్ సీఎంగా నితీశ్ ప్రమాణస్వీకారం
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:14 PM
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్తో పాటు 27 మంది మంత్రులు కూడా తమ పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నితీశ్కు శుభాకాంక్షలు తెలిపారు.
పట్నా, నవంబర్ 20: బిహార్ సీఎంగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్రానికి ఆయన ప్రమాణస్వీకారం చేయడం ఇది పదోసారి. పట్నాలోని గాంధీ మైదానంలో నితీశ్(Nitish Kumar)తో పాటు 27 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా.. సామ్రాట్ చౌదరీ, విజయ్ కుమార్ సిన్హాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు.
కూటమి సూపర్ హిట్..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అదరగొట్టింది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే ఏకంగా 202 సీట్లు దక్కించుకుంది. బీజేపీ 101 సీట్లలో పోటీ చేసి 89 చోట్ల గెలుపొందింది. 101 సీట్లలోనే పోటీ చేసిన జేడీయూ 85 చోట్ల విజయం సాధించింది. తాజాగా ప్రమాణస్వీకారం చేసిన 27 మంత్రుల్లో.. 14 మంది బీజేపీ నుంచి కాగా, 9 మంది జేడేయూకు చెందిన నేతలు. బిహార్లో సీఎం నితీశ్ కుమార్ దాదాపు 19 ఏళ్లు పదవిలో ఉన్నారు. 2000 సంవత్సరంలో ఏడు రోజులు మాత్రమే సీఎంగా పని చేశారు. ఇప్పుడు ఎన్డీయే కూటమి మళ్లీ ఆయనకే పగ్గాలు అప్పగించడంతో పదోసారి సీఎంగా ప్రమాణం చేశారు.
మోదీ శుభాకాంక్షలు..
పదోసారి బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్కు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. ‘సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నితీశ్ రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు. రాష్ట్రంలో మంచి పాలన అందించిన వ్యక్తి అనే అద్భుతమైన రికార్డు ఆయనకు ఉంది’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News