Chennai metro: మెట్రోరైలు మార్గంలో కూలి పడిన కాంక్రీట్ గడ్డర్ అటుగా వెళుతున్న మోటార్ సైక్లిస్ట్ మృతి
ABN , Publish Date - Jun 14 , 2025 | 05:00 AM
మెట్రోరైలు మార్గం నిర్మాణ పనుల్లో భాగంగా రెండు స్తంభాల నడుమ బిగిస్తున్న 40 అడుగుల పొడవైన సిమెంట్ కాంక్రీట్ గడ్డ్డర్ కూలిపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.

నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో ఘటన
చెన్నై, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): మెట్రోరైలు మార్గం నిర్మాణ పనుల్లో భాగంగా రెండు స్తంభాల నడుమ బిగిస్తున్న 40 అడుగుల పొడవైన సిమెంట్ కాంక్రీట్ గడ్డ్డర్ కూలిపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. చెన్నై నగరంలో మూడు మార్గాల్లో మెట్రోరైల్ 2వ విడత పనులు జరుగుతున్నాయి. వీటిలో మాధవరం-చోళింగనల్లూరు మధ్య 44.6 కి.మీ మేర రైలు మార్గం నిర్మిస్తున్నారు. పోరూరు నుంచి నందంబాక్కం ట్రేడ్ సెంటర్ దాకా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పొద్దుపోయాక రామాపురం వద్ద డీఎల్ఎ్ఫ-ఎల్ అండ్ టి నడుమ స్తంభాలపై నిర్మించిన రైలుమార్గం నుంచి హఠాత్తుగా సిమెంట్ కాంక్రీట్ గడ్డర్ కూలిపడింది.
ఆ సమయంలో అటుగా మోటారు సైకిల్పై వెళుతున్న రమేష్ (42) అనే వ్యక్తిపై ఆ గడ్డర్ పడడంతో అతను దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో స్తంభించిన ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతుడి కుటుంబానికి ఎల్ అండ్ టీ సంస్థ రూ.20 లక్షలు, చెన్నై మెట్రోరైల్ సంస్థ రూ. 5లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు