Manipur: మణిపూర్ పేరు తొలగింపుపై ఆందోళనలు తీవ్రం.. కార్యాలయాలకు తాళాలు
ABN , Publish Date - May 27 , 2025 | 08:45 PM
నిరసనకారులు ఇంఫాల్ వెస్ట్లోని లామ్మేల్పాట్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్టోరల్ కార్యాలయాలకు తాళాలు వేశారు. గవర్న్మెంట్ ఆఫ్ ఇండియా అనే పేరున్న సైన్బోర్డ్కు మసిపూశారు. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్లలో ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపారు.

ఇంఫాల్: ప్రభుత్వ బస్సుపై నుంచి మణిపూర్ (Manipur) పేరును తొలగించడంపై ఆ రాష్ట్రంలో తలెత్తిన వివాదం ముదురుతోంది. మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ (COCOMI) ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు మేరకు గత ఆదివారం ప్రజలు చేపట్టిన ఆందోళన మంగళవారం మరింత తీవ్రమైంది. నిరసనకారులు ఇంఫాల్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి, సైన్బోర్డులకు మసిపూశారు.
నిరసనకారులు ఇంఫాల్ వెస్ట్లోని లామ్మేల్పాట్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్టోరల్ కార్యాలయాలకు తాళాలు వేశారు. గవర్న్మెంట్ ఆఫ్ ఇండియా అనే పేరున్న సైన్బోర్డ్కు మసిపూశారు. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్లలో ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపారు. ఖురయీలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వరకూ మహిళా నిరసనకారులు ప్రదర్శన చేపట్టారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంఫాల్ వెస్ట్లో నిరసనకారులు 'స్వయం నిర్ణయాధికారం తమ హక్కు' అనే నినాదంతో ఉన్న ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నిరసనలు తెలిపారు. ప్రభుత్వ యంత్రాగం నిర్లక్ష్యం, అశాంతికి కారణమైన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, సెక్యూరిటీ అడ్వయిజర్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
ఏమిటీ వివాదం
ఈనెల 20న ఉఖ్రుల్ జిల్లాలోని శిరుయ్ లిల్లీ ఉత్సవ విశేషాలను కవర్ చేసేందుకు జర్నలిస్టులతో వెళ్తున్న ప్రభుత్వ బస్సును భద్రతా సిబ్బంది ఆపారు. బస్సు విండ్షీల్డ్పై రాసి ఉన్న మణిపూర్ అనే రాష్ట్రం పేరు కనిపించకుండా తెల్లకాగితంతో కప్పాలని బస్సులోని సిబ్బందిని బలవంతం చేశారు. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. మణిపూర్ గుర్తింపును అమానించిన గవర్నర్ క్షమాపణ చెప్పాలని నిరసనకారులు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలోనే సోమవారంనాడు న్యూఢిల్లీ నుంచి ఇంఫాల్ వచ్చిన గవర్నర్ భల్లాను ఆర్మీ హెలికాప్టర్లో మరో చోటికి తరలించారు. రాజ్భవన్ వరకూ నిరసనకారులు ప్రదర్శన చేపట్టే ఆలోచనలో ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో భద్రతా దళాలు అడ్డుకున్నాయి. మణిపూర్లో తలెత్తిన తాజా ఆందోళనలో నేపథ్యంలో అసోం రైఫిల్స్, ఆర్పీఎఫ్ సిబ్బంది సహా కేంద్ర బలగాలను ఇంఫాల్లో మోహరించారు.
ఇవి కూడా చదవండి..
పాక్ ఆర్మీ పోస్టులపై విరుచుకుపడిన భారత బలగాలు.. బీఎస్ఎఫ్ కొత్త వీడియో రిలీజ్
ఆ ఉగ్రవాద ముల్లును తొలగించాల్సిన సమయం వచ్చింది..
Read Latest National News and Telugu News