Mallikarjun Kharge Rajya Sabha: కాల్పులపై విచారణ ఏది, ట్రంప్ వ్యాఖ్యలు ఏంటి.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఖర్గే..
ABN , Publish Date - Jul 21 , 2025 | 12:42 PM
నేటి (జూలై 21) నుంచి దేశంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్సభ, రాజ్యసభలలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై కీలక ప్రశ్నలు వేశారు.

దేశంలో నేటి (జూలై 21) నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), ఇటీవలి భారత్-పాకిస్తాన్ సంఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన శాంతి ఒప్పందం వాదనలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏప్రిల్ 22న జరిగిన పెహల్గామ్ దాడి గురించి మాట్లాడుతూ, ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడి జరిగి నెలలు గడిచినా, ఆ ఉగ్రవాదులను ఇప్పటి వరకు పట్టుకోలేదు, వారి గురించి సమాచారం కూడా లేదన్నారు.
సైన్యానికి ధైర్యం
మా పార్టీ మాత్రమే కాదు, అన్ని పార్టీలు దేశాన్ని బలోపేతం చేయడానికి, సైన్యానికి ధైర్యం నింపడానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కానీ, ఇప్పుడు అసలు పెహల్గామ్ దాడి జరిగిన దాని గురించి స్పష్టమైన సమాచారం కావాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఇంటెలిజెన్స్ విషయంలో లోపం జరిగిందని లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు. ఆ క్రమంలో ఆపరేషన్ సిందూర్ గురించి ప్రభుత్వం ప్రపంచానికి, భారత ప్రజలకు చెప్పింది. కానీ, ఆ తర్వాత ఏమైంది, ఏం జరిగిందో సమాచారం ఇవ్వాలని ఖర్గే కోరారు.
శాంతి ఒప్పందం మ్యాటర్ ఏంటి?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని 24 సార్లు పేర్కొన్నారని ఖర్గే గుర్తు చేశారు. ట్రంప్ ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నారు? శాంతి ఒప్పందం జరిగిందా? ఒకవేళ జరిగితే, దాని వివరాలు ఏంటి? ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలన్నారు. దేశ ప్రజలకు, పార్లమెంటుకు సమాచారం అందించడం ప్రభుత్వం బాధ్యత అని ఈ సందర్భంగా ఖర్గే గుర్తు చేశారు.
ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులను పట్టుకోవడంలో జాప్యం జరగడం, ఇంటెలిజెన్స్ వైఫల్యం గురించి ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. మన సైన్యం ధైర్యంగా పోరాడుతోంది. కానీ, ఇటువంటి సంఘటనలు మన భద్రతా వ్యవస్థలోని లోపాలను బయటపెడుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
చర్చకు సిద్ధమైన ప్రభుత్వం
విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ప్రభుత్వం మాట్లాడేందుకు సిద్ధంగా ఉందని, అన్ని వివరాలనూ దేశ ప్రజలకు తెలియజేస్తామని బీజేపీ నేత, రాజ్యసభలో లీడర్ ఆఫ్ ది హౌస్ జేపీ నడ్డా స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం ఈ ప్రశ్నలకు ఎలా సమాధానం ఇస్తుంది, ఏంటనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైతే, అది భారత సైన్యం, మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు నిదర్శనంగా నిలుస్తుంది. కానీ, పూర్తి వివరాలు పార్లమెంటులో చర్చ ద్వారా వెల్లడిస్తేనే, ప్రజలకు మరింత స్పష్టత వచ్చే ఛాన్సుంది.
ఇవి కూడా చదవండి
ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి