Share News

COVID 19 Cases: మహారాష్ట్రలో కొత్తగా 43 కోవిడ్ కేసులు.. 200 దాటిన యాక్టివ్ కౌంట్

ABN , Publish Date - May 26 , 2025 | 10:00 AM

గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మొదలైన కరోనా వైరస్ కేసులు ఇప్పుడు ఇండియాలో కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కొత్తగా 43 కరోనా కేసులు (COVID 19 Cases) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 200 దాటింది.

COVID 19 Cases: మహారాష్ట్రలో కొత్తగా 43 కోవిడ్ కేసులు.. 200 దాటిన యాక్టివ్ కౌంట్
New COVID cases Maharashtra

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు మరోసారి ప్రబలుతున్న వేళ, తాజాగా ఇండియాలోని మహారాష్ట్రలో కూడా ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో రాష్ట్రంలో 43 కొత్త కరోనా కేసులు (COVID 19 Cases) నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 209కి చేరింది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం పూణేలో అత్యధికంగా 35 కేసులు నమోదు కాగా, ముంబైలో 8 కొత్త కేసులు రికార్డయ్యాయి. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, జనవరి నుంచి మహారాష్ట్రలో మొత్తం 300 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జనవరిలో 1 కేసు, ఫిబ్రవరిలో 1, మార్చిలో 0, ఏప్రిల్‌లో 4 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మే నెలలో 242 కేసులు నమోదయ్యాయి. అంటే, మొత్తం ఇన్ఫెక్షన్ కేసులలో 80 శాతం మే నెలలోనే నమోదయ్యాయి.


ముంబైలో అత్యధిక కేసులు

ఇప్పటివరకు నమోదైన 300 కేసుల్లో 248 ముంబై నుంచే నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో ఇవి 82.67%. దీన్ని బట్టి చూస్తే ముంబై మరోసారి కరోనా కేంద్రంగా మారుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కారణంగా నాలుగు మరణాలు మాత్రమే నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్త మరణం సంభవించలేదు. ఈ క్రమంలో చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్న 87 మంది రోగులు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. కోవిడ్ సంక్రమణను నివారించడానికి ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. దీంతోపాటు ప్రజలు కూడా మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది.


కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలు

- రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎల్లప్పుడూ మాస్క్‌ను ధరించడం, ముఖ్యంగా మీకు అనారోగ్యంగా అనిపిస్తే

- తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం లేదా శానిటైజర్ వాడటం కొనసాగించండి

– మీకు జ్వరం లేదా జలుబు, ఒంటి నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే పరీక్షలు చేయించుకుని కోవిడ్ గురించి నిర్ధారించుకోండి

- వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి


ఇవీ చదవండి:

నేడు పంజాబ్ vs ముంబై మధ్య కీలక మ్యాచ్..

సీక్రెట్ కోడ్ ట్రిక్స్.. సైబర్ నేరాలకు చెక్‌..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 10:00 AM