Leopard: అమ్మో.. చిరుత ఎంత దర్జాగా తిరుగుతోందో..
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:20 PM
తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు ప్రాంతంలో రిజర్వు ఫారెస్ట్ పరిధిలోవున్న గ్రామాల్లో చిరుతపులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తిరుత్తణి నుండి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు వరకు విస్తరించివున్న దట్టమైన అడవులు, పర్వతశ్రేణులు, జంతువులతో పచ్చటి ప్రకృతి సౌందర్యం, రమణీయమైన వాతావరణాల మధ్య చిన్నచిన్న గిరిజన గ్రామాలు, తండాల ప్రజలు నివసిస్తుంటారు.

- పళ్లిపట్టు రిజర్వ్ ఫారెస్టులో చిరుత సంచారం
చెన్నై: తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు ప్రాంతంలో రిజర్వు ఫారెస్ట్ పరిధిలోవున్న గ్రామాల్లో చిరుతపులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తిరుత్తణి నుండి ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లోని చిత్తూరు వరకు విస్తరించివున్న దట్టమైన అడవులు, పర్వతశ్రేణులు, జంతువులతో పచ్చటి ప్రకృతి సౌందర్యం, రమణీయమైన వాతావరణాల మధ్య చిన్నచిన్న గిరిజన గ్రామాలు, తండాల ప్రజలు నివసిస్తుంటారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం సాయంత్ర అడవిలో మేకలు కాసేందుకు వెళ్ళిన ఐదుగురు చిరుతపులి కనిపించినట్లు గ్రామస్తులకు తెలిపారు.
దీంతో బెంబేలెత్తిన గ్రామస్తులు తమ గ్రామ శివారు ప్రాంతాల్లోని నొచ్చిలి, కావూరు కండ్రిగై, కాకులూరు, రంగరాజు కండిగై గ్రామాల్లో చిరుతపులులు సంచరిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కాపూరు కండ్రిగై ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ సీసీ కెమెరాలో చిరుతపులి సంచరిస్తున్న వీడియో రికార్డు అయ్యింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకునేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
ఊటీ సమీపంలో ...
చెన్నై: నీలగిరి జిల్లాలోని అడవీ ప్రాంతం నుంచి బయటకొచ్చిన చిరుతపులి శుక్రవారం తెల్లవారుజామున ఊటీ(Ooty) సమీపంలోని ఎడక్కాడు ప్రాంతంలో సంచరించింది. ఊటీకి వెళ్ళే మార్గంలోవున్న ఎడక్కాడు ప్రాంతంలో వంతెనపై చిరుత నడిచి రావడం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో కనిపించింది. దీంతో ఆ సమయంలో అటు వెళ్ళిన వాహనచోదకులు పులిని చూసి భయబ్రాంతులకు గురయ్యారు. వారిలో కొంతమంది వాహనాన్ని దిగి వంతెనపై నడిచివెళ్తున్న చిరుతను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరలవుతుండటంతో ఎడక్కాడు పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు, పర్యాటకులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, వాహనచోదకులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరకున్న ఫారెస్ట్ అధికారులు చిరుతపులి ఆనవాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అడవీ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లౌడ్ స్పీకర్ల ద్వారా హెచ్చరించారు. అడవులకు దగ్గరవున్న మార్గం గుండా వన్యమృగాలు సంచరించే అవకాశముందని అందువల్ల వాటి దగ్గరకు వెళ్ళి ఫొటోలు, సెల్ఫీలు తీయరాదని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News