‘జంధ్యం వివాదం’లో ఇద్దరు హోంగార్డుల సస్పెన్షన్
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:52 AM
వృత్తివిద్యా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించిన సీఈటీ పరీక్షలు రాసేందుకు వెళ్లిన విద్యార్థుల జంధ్యం తొలగించాలని ఆంక్షలు విధించిన వ్యవహారంపై జిల్లా అధికారి గురుదత్త హెగ్డే స్పందించారు.

బెంగళూరు, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): వృత్తివిద్యా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించిన సీఈటీ పరీక్షలు రాసేందుకు వెళ్లిన విద్యార్థుల జంధ్యం తొలగించాలని ఆంక్షలు విధించిన వ్యవహారంపై జిల్లా అధికారి గురుదత్త హెగ్డే స్పందించారు. శివమొగ్గలోని ఆదిచుంచనగిరి పీయూ కళాశాల పరీక్షా కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తూ, జంధ్యాన్ని తొలగించాలని సూచించిన ఇద్దరు హోంగార్డులను సస్పెండ్ చేశారు.
ఈ వివాదంపై కర్ణాటక బ్రాహ్మణ సభ ప్రతినిధి నటరాజ్ భాగవత్ ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు విద్యార్థులకు జంధ్యం తొలగించాలని సూచించగా, ఒక విద్యార్థి తొలగించుకుని పరీక్ష రాశారు. మరో విద్యార్థి కాసేపు వేచి ఉండి, ప్రిన్సిపాల్ అనుమతితో పరీక్ష రాశారు. బీదర్లో విద్యార్థి సుచివ్రత్ జంధ్యం తొలగించడం ఇష్టంలేక పరీక్ష రాయకుండా వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న బ్రాహ్మణ మహాసభ శనివారం ఆందోళనకు దిగింది.