Japan: జపాన్లో రేపు ఏం జరగనుంది
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:18 AM
జపాన్లో 2025 జూలై 5న ఒక పెనువిపత్తు సంభవిస్తుంది. జపాన్కి, ఫిలిప్పీన్స్కి నడుమ సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుంది.

జూలై 5న భయంకరమైన సునామీ వస్తుందంటూ..
1999లో చెప్పిన జపనీస్ మాంగా ఆర్టిస్ట్ టట్సుకీ
కొవిడ్ గురించి, 2011లో జపాన్ను వణికించిన భూకంపం, సునామీలపై నిజమైన ఆమె జోస్యాలు
రెండు వారాలుగా జపాన్లోని టొకారో దీవుల్లో 900కు పైగా భూప్రకంపనలతో ప్రజల్లో ఆందోళన
టోక్యో, జూలై 3: ‘జపాన్లో 2025 జూలై 5న ఒక పెనువిపత్తు సంభవిస్తుంది. జపాన్కి, ఫిలిప్పీన్స్కి నడుమ సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుంది. దాని ప్రభావంతో 2011లో పెను విధ్వంసం సృష్టించిన సునామీకన్నా ఎత్తైన అలలు సముద్రంలో ఏర్పడతాయి’
జపాన్కు చెందిన మాంగా ఆర్టిస్ట్, ‘న్యూ బాబా వంగా’గా పేరొందిన ర్యోటుట్సుకీ రాసిన ‘ద ఫ్యూచర్ ఐ సా’ పుస్తకంలో చెప్పిన జోస్యం ఇది! 1999లో మొదటిసారి ప్రచురితమైన ఈ పుస్తకం.. 2021 అక్టోబరులో పునఃప్రచురితమైంది. 2019లో ప్రపంచాన్ని కుదిపేసిన కొవిడ్ సహా ఆ పుస్తకంలో ఆమె చెప్పిన పలు జోస్యాలు నిజంకావడంతో ఇది కూడా నిజమవుతుందేమోనని జపనీయులు భయపడుతున్నారు. గత రెండువారాలుగా దక్షిణ జపాన్లోని టొకారా దీవుల్లో 900కుపైగా భూప్రకంపనలు నమోదవడం వారి భయాన్ని మరింత పెంచుతోంది. ‘‘ఎప్పుడూ కదులుతున్నట్టే ఉంది. నిద్రపోవాలంటే భయమేస్తోంది’’ అని ఆ దీవుల ప్రజలు వాపోతున్నారు. సునామీ భయంతో సురక్షిత ప్రాంతానికి తరలిపోవాలని భావిస్తున్నారు.
జూన్ 21 నుంచి మొదలైన ఈ భూప్రకంపనల తీవ్రత క్రమంగా పెరుగుతూ తాజా గా 5.5 తీవ్రతతో ఒక భూకంపం నమోదుకావడంతో జపాన్ వాతావరణ సంస్థ అప్రమత్తమైంది. అయితే.. టట్సుకీ జోస్యాన్ని నమ్మలేమని, అలాంటి సునామీ వస్తుందనడానికి ఎలాంటి సహేతుకమైన, శాస్త్రీయ ఆధారాలూలేవని జపాన్ వాతావరణ సంస్థ అధికారులు కొట్టిపారేస్తున్నారు. 12 దీవుల సమాహారమైన టొకారాలో.. 7 దీవుల్లో 700 మంది నివసిస్తున్నారు. 4 ప్రధాన టెక్టానిక్ ప్లేట్ల నడుమ ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’గా పేర్కొనే ప్రాంతంలో ఉండే జపాన్కు భూప్రకంపనలు కొత్తకాదు. ముఖ్యంగా టొకారో దీవుల్లో ఉండే వారికి భూప్రకంపనలు సాధారణమే. 2023 సెప్టెంబరులో అక్కడ 346 ప్రకంపనలు నమోదయ్యాయి. కానీ టట్సుకీ చెప్పిన తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఇన్ని ప్రకంపనలు వారిని భయపెడుతోంది.
టూరిస్టులూ రావట్లే..
టట్సుకీ జోస్యం గురించి విస్తృతంగా ప్రచారంకావడంతో చైనా, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల నుంచి జపాన్కు ఎక్కువగా వచ్చే పర్యాటకుల సంఖ్య మూడు నెలలుగా బాగా తగ్గిపోయింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పర్యాటకుల సంఖ్య 50శాతం తగ్గింది. సాధారణంగా హాంకాంగ్ నుంచి జపాన్కు వెళ్లే పర్యాటకులు సంఖ్య ఎక్కువుంటుంది. జూన్-జూలై నెలల్లో హాంకాంగ్ నుంచి జపాన్కు విమాన టికెట్ల బుకింగ్లు 83శాతం పడిపోయాయి. బుకింగ్లు లేకపోవడంతో దక్షిణ జపాన్లోని పలు నగరాలకు ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో నడపాల్సిన విమానాలను హాంకాంగ్ ఎయిర్లైన్స్ రద్దు చేసింది. తస్మాత్ జాగ్రత్త: ‘2020 ఏప్రిల్లో ప్రపంచమంతా ఒక వైరస్ వ్యాపిస్తుంది..’’అంటూ కొవిడ్ గురించి టట్సుకీ 1999లోనే జోస్యం చెప్పారు. అది నిజమైంది. ఆమె జోస్యం అక్కడితో ఆగలేదు. ‘‘ఆ వైరస్ కొంతకాలంపాటు మాయమై 2030లో మరింత ప్రాణాంతకంగా మారి మళ్లీ వస్తుంది’ అని చెప్పారు. ఆమె చెప్పినట్టే జపాన్లో ఇప్పుడు సునామీవస్తే 2030ని తల్చుకుని ప్రపంచం వణికిపోవడం ఖాయం!