Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో వర్ష బీభత్సం.. మెరుపు వరదల్లో ముగ్గురు మృతి
ABN , Publish Date - Apr 20 , 2025 | 02:58 PM
చీనాబ్ వంతెన సమీపంలోని ధరంకుండ్ గ్రామాన్ని వరదలు ముంచెత్తినట్టు అధికారులు తెలిపారు. పలు వాహనాలు కొట్టుకుపోగా, ఇళ్లలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తలించేదుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాంబాన్ జిల్లాలో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో మెరుపు వరదల కారణంగా ముగ్గురు మృతి చెందారు. సుమారు 200 మందిని సహాయక సిబ్బంది రక్షించింది. నశ్రీ, బనిహాల్ మధ్య సుమారు డజను ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలను రద్దు చేసారు.
‘జంధ్యం వివాదం’లో ఇద్దరు హోంగార్డుల సస్పెన్షన్
రాంబాన్ జిల్లా సెరి బగ్నా గ్రామంపై ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు విరుచుకుపడటంతో అఖిక్ అహ్మద్, మహమ్మది సాఖిబ్ సోదరులతో సహా ముగ్గురు ముగ్గురు మృతి చెందినట్టు అధికారులు చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం ఎస్డీఆర్ఎఫ్తో ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు చేపడుతోంది. చంబా సేరీ గ్రామంలో ముగ్గురు చిన్నారులు వరద నీటిలో చిక్కుకుపోవడంతో వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా చీనాబ్ వంతెన సమీపంలోని ధరంకుండ్ గ్రామాన్ని వరదలు ముంచెత్తినట్టు అధికారులు తెలిపారు. పలు వాహనాలు కొట్టుకుపోగా, ఇళ్లలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తలించేదుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో 50కి పైగా వాహనాలు నిలిచిపోయాయి. అక్కడి టన్నల్ ముందు కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యల్లో ఆటంకం తలెత్తింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.
రెండు రోజుల్లో ఐదుగురు మృతి
జమ్మూలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి పిడుగు పాటుకు ఒక మహిళతో సహా ఇద్దరు గాయపడ్డారు. ధరంకుండ్ గ్రామంలో మెరుపు వరదలతో తీవ్ర నష్టం జరిగిందని, సుమారు 40 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
సీఎం స్పందన
కాగా, మెరుపు వరదలు, కొండచరియలు భయోత్పాతం సృష్టిస్తుండటంతో పరిస్థితిని అంచనా వేసేందుకు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి, ఉదంపూర్ ఎంపీ జితేంద్ర సింగ్ స్పందిస్తూ, డిప్యూటీ కమిషనర్ బహీర్-ఉల్-హక్ చౌదరితో తాను సంప్రదింపులు జరుపుతున్నానని, సహాయక చర్యలకు తగిన సాయం అందిస్తున్నామని చెప్పారు. అవసరమైతే తన నిధులను కూడా కేటాయిస్తానని చెప్పారు. ఇది భయాందోళనలకు గురికావాల్సిన సమయం కాదని, ప్రకృతి వైపరీత్యాన్ని సమష్టిగా ఎదుర్కోవాలని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..