IRCTC Ticket Booking Scam: రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
ABN , Publish Date - Jun 04 , 2025 | 03:17 PM
చాలా సందర్భాలలో రైల్వే టిక్కెట్ల బుకింగ్స్ (IRCTC Ticket Booking Scam ) క్షణాల్లోనే అయిపోతుండటం చూస్తుంటాం. కానీ ఇది నిజం కాదని, దీని వెనుక ఓ పెద్ద స్కాం ఉందని తాజాగా IRCTC తెలిపింది. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని ప్రకటించింది. లక్షలాది ప్రయాణికులు ప్రతిరోజూ ఎదుర్కొనే టికెట్ బుకింగ్ సమస్య వెనుక ఉన్న రహస్యాన్ని తాజాగా బయట పెట్టింది. ప్రధానంగా పండుగ సీజన్లలో రైల్వే టికెట్లు కొన్ని సెకన్లలోనే సేల్ అవుతుంటాయి. దీంతో అనేక మంది ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి లోనవుతుంటారు. కానీ అలా టిక్కెట్లు త్వరగా అయిపోవడం వెనుక ఓ భారీ స్కామ్ (IRCTC Ticket Booking Scam) ఉందని, తాజాగా వెలుగులోకి వచ్చిందని తెలిపింది.
నకిలీ ఐడీలతో టికెట్లు బుక్
ఈ క్రమంలో IRCTC చేసిన విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. గత అయిదు నెలల్లో టికెట్ బుకింగ్ విండో ఓపెన్ కావడానికి ఐదు నిమిషాల ముందే 2.9 లక్షల PNRలు జనరేట్ అయ్యాయి. ఇది నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం. ఆ క్రమంలో టికెట్లు ముందుగానే బుక్ చేసి, తరువాత మోసపూరితంగా ఎక్కువ ధరలకు ప్రయాణికులకు అమ్మేస్తున్నారు. వారు బాట్స్ (bots) అనే ఆటోమేటెడ్ టూల్స్తో టికెట్లను క్షణాల్లో బుక్ చేసేవారు. దీంతో సాధారణ ప్రయాణికులు లాగిన్ అయ్యేలోపే టికెట్లు అమ్ముడవుతూ ఉండేవి.
సమస్య ఎంత పెద్దదంటే
ఒకవేళ మీరు కూడా ప్రయాణించేందుకు IRCTCలో టైముకు లాగిన్ అయి టికెట్ల కోసం ప్రయత్నిస్తే మీకు వెంటనే Waiting List రావడం లేదా Tickets Not Available అని మెసేజ్ వస్తే మాత్రం అప్పుడు అది స్కాం అని చెప్పవచ్చు. ఎందుకంటే మీ కంటే ముందే వందల బాట్స్ ఆ టికెట్లను కావాలనే బుక్ చేస్తాయి. తర్వాత వాటిని ఎక్కువ ధరకు సేల్ చేస్తారు. ఇది చిన్న మోసం కాదని, ఒక పెద్ద ముఠాగా మారిపోయి, దేశవ్యాప్తంగా స్కాం చేశారని అధికారులు పేర్కొన్నారు.
ముందుగానే..
దీంతో ప్రత్యేక రైళ్ల టికెట్లు, తత్కాల్ టికెట్లు ఇలా ఏదైనా బుక్ చేయాలంటే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. బుకింగ్ ఓపెన్ అయ్యే సమయానికి ముందే టికెట్లు మాయమైపోతుంటమే ఈ స్కామ్ ప్రధాన లక్ష్యమన్నారు అధికారులు. ఈ ముఠా బాట్స్ ఉపయోగించి IRCTC వెబ్సైట్లో ప్రోగ్రామింగ్ స్క్రిప్ట్లు రన్ చేసి, ముందుగా లాగిన్ అయి టికెట్లు బుక్ చేసినట్లు చెప్పారు. అలాగే నకిలీ ఆధారాలతో యూజర్ అకౌంట్లను తయారు చేసి, రిజర్వేషన్లను లాగింగ్ ప్రాసెస్ను ముందుగా హ్యాక్ చేసేవారని వెల్లడించారు.
రైల్వే అధికారుల చెక్
ఈ టికెట్లను తరువాత పెద్ద మొత్తాలకు మధ్యవర్తుల ద్వారా ప్రయాణికులకు బ్లాక్లో అమ్మేవారు. ఇది పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకం. దీనివల్ల లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు న్యాయంగా ప్రయాణించలేక నష్టపోయేవారు. ఈ ముఠాలో భాగమై ఉన్న నలుగురిని తాజాగా అరెస్ట్ చేసినట్టు సమాచారం. అనేక టెక్నికల్ విశ్లేషణల ద్వారా వారి బాట్లను గుర్తించి, ఫేక్ ఐడీలను బ్లాక్ చేశారు.
ఈ క్రమంలో ఇప్పుడు Anti Bot Application అనే కొత్త టెక్నాలజీని కూడా ప్రవేశపెట్టారు. ఈ యాప్ బాట్స్ ద్వారా జరిగే ఆటోమేటెడ్ బుకింగ్ను తక్షణమే గుర్తించి ఆపేస్తుంది. తద్వారా సామాన్య ప్రయాణికులకు మరింత పారదర్శకంగా, సమయానికి టికెట్లు లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో 2.5 కోట్లు నకిలీ యూజర్ ఐడీలు బ్లాక్ చేసినట్టు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి:
ఈ డాట్ ఉంటే అమెజాన్, లేదంటే ఫేక్..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండ