Military Operation: ఉల్ఫాపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:34 AM
ఈశాన్య ప్రాంతంలోని వేర్పాటువాద గ్రూపులపై భారత సైన్యం సర్జికల్ దాడులకు దిగింది..

మయన్మార్లోని శిబిరాలే లక్ష్యంగా డ్రోన్ దాడులు
ముగ్గురు సీనియర్లను కోల్పోయిన ఉల్ఫా-ఐ
19 మందికి గాయాలైనట్టు ప్రకటన.. ఖండించిన భారత సైన్యం
న్యూఢిల్లీ, గువాహటి, జూలై 13: ఈశాన్య ప్రాంతంలోని వేర్పాటువాద గ్రూపులపై భారత సైన్యం సర్జికల్ దాడులకు దిగింది. మయన్మార్లోని తమ శిబిరాలపై భారత సైన్యం డ్రోన్, క్షిపణి దాడులు చేసినట్టు నిషేధిత ఉల్ఫా-ఐ (యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం-ఇండిపెండెంట్) ఆదివారం ప్రకటించింది. ఈ దాడుల్లో ముగ్గురు సీనియర్ నాయకులను కోల్పోయామని, దాదాపు 19 మంది గాయపడ్డారని వెల్లడించింది. మయన్మార్ సైన్యం సహకారంతో ఉల్ఫా-ఐ, ఎన్ఎస్సీఎన్-కే (నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్-ఖప్లాంగ్) స్థావరాలపై ఆదివారం తెల్లవారుజామున భారత సైన్యం డ్రోన్ దాడు లు చేసినట్టు సమాచారం. భారత సరిహద్దులోని మయన్మార్లో నాగా స్వయం పాలిత ప్రాంతమైన హోయత్ బస్తీలోని ఉల్ఫా-ఐ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం, వక్తం బస్తీలోని 779 శిబిరంతోపాటు మరో రెండు శిబిరాలు లక్ష్యంగా రెండు గంటలకుపైగా దాడులు జరిగాయి. ఈ దాడులకు 300కుపైగా డ్రోన్లను వినియోగించినట్టు తెలిసింది. ఈ దాడుల్లో ఉల్ఫా-ఐ అగ్ర కమాండర్ నయన్ మేధి అలియాస్ నయన్ అసోం మరణించినట్టు ఉల్ఫా-ఐ తెలిపింది. పరేశ్ బారువా నేతృత్వంలోని నిషేధిత ఉల్ఫా-ఐ సంస్థకు ఆయన కీలక వ్యూహకర్తగా, సైనిక శిక్షకుడిగా ఉన్నాడు. అలాగే.. ఈ డ్రోన్ దాడుల్లో ఎన్ఎ్ససీఎన్-కేకు చెందిన శిబిరాలూ దెబ్బతిన్నాయి. కాగా, నయన్ అసోం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తమ శిబిరంపై మరోసారి క్షిపణి దాడి జరిగిందని ఉల్ఫా-ఐ పేర్కొంది. ఆ సమయంలో బ్రిగేడియర్ గణేశ్ అసోం, కల్నల్ ప్రదీప్ అసోం మ రణించారని ప్రకటించింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. మయన్మార్లోని కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ, నాగా తిరుగుబాటుదారు లు, పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ, అఫ్గాన్లోని ముజాహిదీన్లతో ఉల్ఫా-ఐకి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, మయన్మార్లోని నిషేధిత ఉల్ఫా-ఐ శిబిరాలపై డ్రోన్ దాడులు చేయలేదని భారత సైన్యం ఆదివారం స్పష్టం చే సింది. ఉల్ఫా-ఐ చేసిన ప్రకటనను భారత సైన్యం ఓ ప్రకటనలో ఖండించింది.