Share News

India COVID-19 Cases: దేశంలో వారంలోనే 1200 శాతం పెరిగిన కొవిడ్ కేసులు.. కారణాలేంటి

ABN , Publish Date - Jun 01 , 2025 | 01:20 PM

భారతదేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 3,395 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి గత వారం కంటే 1200 శాతం పెరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.

India COVID-19 Cases: దేశంలో వారంలోనే 1200 శాతం పెరిగిన కొవిడ్ కేసులు.. కారణాలేంటి
India COVID19 Cases

దేశంలో కొవిడ్ కేసులు (India COVID-19 Cases) క్రమంగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం శనివారం ఉదయం నాటికి దేశంలో 3,395 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గత వారంతో పోలిస్తే ఇవి దాదాపు 1,200 శాతం పెరగడం విశేషం. మే 22న దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కేసులు ఉండగా, మే 26 నాటికి అవి 1,010కి చేరాయి. కానీ జూన్ 1 నాటికి ఇవి అమాంతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.


ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాలు

కేరళలో కొవిడ్ కేసులు అత్యధికంగా ఉన్నాయి. శుక్రవారం 189 కొత్త కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 1,336 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్‌లో 265, కర్ణాటకలో 234, పశ్చిమ బెంగాల్‌లో 205, తమిళనాడులో 185, ఉత్తరప్రదేశ్‌లో 117 కేసులు ఉన్నాయి. రాజస్థాన్ (60), పుదుచ్చేరి (41), హర్యానా (26), ఆంధ్రప్రదేశ్ (17), మధ్యప్రదేశ్‌లో (16) కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ సంవత్సరం ఇప్పటివరకూ మొత్తం 26 మరణాలు నమోదయ్యాయి.


కేసుల పెరుగుదలకు కారణం ఏంటి

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, పశ్చిమ, దక్షిణ భారతదేశంలో నమూనాల జన్యు విశ్లేషణలో కొత్త వేరియంట్లైన ఒమిక్రాన్ ఉప వేరియంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ వేరియంట్లు 2022లో భారతదేశంలో కరోనా సెంకడ్ వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ రకానికి చెందినవి. ఈ కొత్త వేరియంట్లలో LF.7, XFG, JN.1, NB.1.8.1 ఉన్నాయని ICMR చీఫ్ డాక్టర్ రాజీవ్ బెహ్ల్ తెలిపారు. వీటిలో మొదటి మూడు వేరియంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దక్షిణ భారతదేశం నుంచి మొదలై, పశ్చిమ భారతదేశం ద్వారా ఇప్పుడు ఉత్తర భారతదేశంలోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ఆయన అన్నారు.


ఆందోళన అవసరం లేదు

ఈ కేసులన్నీ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) ద్వారా పర్యవేక్షించబడుతున్నాయి. డాక్టర్ బెహ్ల్ ప్రకారం.. ప్రస్తుతం కరోనా సోకిన వారిలో లక్షణాలు స్వల్పంగా ఉన్నాయన్నారు. కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు అవి సహజంగా లేదా వ్యాక్సిన్ ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తిని దాటుతాయని, అయినప్పటికీ ప్రస్తుతం ఆందోళన అవసరం లేదని డాక్టర్ బెహ్ల్ అంటున్నారు. కానీ క్రమంగా పెరుగుతున్న కేసుల తీరు చూస్తే మాత్రం ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇలాంటి క్రమంలో జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.


ఇవీ చదవండి:

వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. 10 కంపెనీల లిస్టింగ్..

జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 07:52 PM