‘కుశ’తో ఇక కాస్కో!
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:26 AM
ఇటీవల పాకిస్థాన్తో ఉద్రిక్తతల సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. శత్రు దేశం ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఆకాశంలోనే విజయవంతంగా కూల్చివేసింది.

స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న డీఆర్డీవో
న్యూఢిల్లీ, జూన్ 14: ఇటీవల పాకిస్థాన్తో ఉద్రిక్తతల సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. శత్రు దేశం ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఆకాశంలోనే విజయవంతంగా కూల్చివేసింది. ఈ క్రమంలో దేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా డీఆర్డీవో దేశీయంగా ‘ప్రాజెక్టు కుశ’లో భాగంగా మూడు రకాలను అభివృద్ధి చేస్తోంది. వాటిని దశలవారీగా 2030 నాటికి సాయుధ దళాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గగనతలంలో బహుళ అంచెల రక్షణను ఏర్పాటు చేసేలా ఈ కుశ వ్యవస్థను రూపొందించారు.
విమానాలు, క్షిపణుల నుంచి వచ్చే ముప్పును అడ్డుకోవడానికి ‘కుశ ఎం1’లో స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థలను అమర్చనున్నారు. మధ్యస్థ శ్రేణి కంటే ఎక్కువ సామర్థ్యంతో కూడిన ఉపరితలం నుంచి వాయు క్షిపణులతో ‘కుశ ఎం2’, అదేవిధంగా 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిలోని లక్ష్యాలను, ముప్పును చేధించేలా ‘కుశ ఎం3‘ను రూపొందించనున్నట్లు డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఈ విస్తృత శ్రేణి వాయు రక్షణ వ్యవస్థ ‘కుశ’ను రష్యాకు చెందిన ఎస్-500కు పోటీగా చూస్తున్నారు.