Operation Sindoor: మనకు ఎలాంటి నష్టం జరగలేదు
ABN , Publish Date - May 15 , 2025 | 05:49 AM
పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో భారత సంపత్తికి ఎలాంటి నష్టం వాటిల్ల లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆపరేషన్ సిందూర్పై కేంద్ర ప్రభుత్వం ప్రకటన
న్యూఢిల్లీ, మే 14: పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో భారత సంపత్తికి ఎలాంటి నష్టం వాటిల్ల లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తద్వారా భారత యుద్ధ విమానాలను దెబ్బతీశామన్న పాక్ వాదనను కొట్టిపారేసింది. అదే సమయంలో నియంత్రణ రేఖను, అంతర్జాతీయ సరిహద్దును దాటకుండానే వైమానిక దాడులు నిర్వహించినట్లు తెలిపింది. దాడుల సమయంలో పాకిస్థాన్లోని చైనా తయారీ గగనతల రక్షణ వ్యవస్థలను భారత వైమానిక దళం... జామ్(తాత్కాలికంగా పనిచేయకుండా చేయడం) చేసిందని వెల్లడించింది.
జామ్ చేసి పాక్లోని సైనిక లక్ష్యాలను దెబ్బతీసినట్లు తెలిపింది. మొత్తం 23 నిమిషాల్లోనే దాడులను పూర్తి చేసినట్లు వెల్లడించింది. అదే విధంగా పాక్ నుంచి వచ్చిన చైనా, టర్కీ తయారీ డ్రోన్లను, మిసైళ్లను... ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ద్వారా విజయవంతంగా అడ్డుకున్నామని భారత్ తెలిపింది. భారత రక్షణ చరిత్రలో, సైనిక చర్యల్లో ఆపరేషన్ సిందూర్ మైలురాయిలా నిలిచిపోతుందని తెలిపింది.