Share News

S Jaishankar: మాకు కావాల్సిన ఉగ్రవాదుల చిట్టా పాక్‌ వద్ద ఉంది!

ABN , Publish Date - May 16 , 2025 | 05:18 AM

ఆపరేషన్‌ సిందూర్‌’ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించామని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారత్‌కు అప్పగించాల్సిన ఉగ్రవాదుల చిట్టా ఇప్పటికే పాకిస్థాన్‌ వద్ద ఉందన్నారు.

S Jaishankar: మాకు కావాల్సిన ఉగ్రవాదుల చిట్టా పాక్‌ వద్ద ఉంది!

  • ఉగ్రవాదంపై పాక్‌ చర్యలు తీసుకునేదాకా సింధు జలాల ఒప్పందం రద్దే: జైశంకర్‌ వెల్లడి

న్యూఢిల్లీ, మే 15: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించామని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారత్‌కు అప్పగించాల్సిన ఉగ్రవాదుల చిట్టా ఇప్పటికే పాకిస్థాన్‌ వద్ద ఉందన్నారు. ఉగ్రవాదంపై ఆ దేశం చర్యలు తీసుకునేదాకా సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని స్పష్టంచేశారు. దేశాల మధ్య లబ్ధి అనేది ద్వైపాక్షిక చర్చలతోనే సాధ్యమని, పాకిస్థాన్‌తో తమకు చర్చలంటూ ఉంటే అది పీవోకేను తిరిగి అప్పగించడంపైనే అని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కాల్పుల విరమణ ఒప్పందంపై మాట్లాడుతూ.. ఏ దేశం ఆ చర్యను కోరుకుందో అందరికీ స్పష్టంగా తెలుసునన్నారు.


‘టీఆర్‌ఎ్‌ఫ’ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్‌ యత్నం

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత లష్కరే తాయిబా అనుబంధ గ్రూపు ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎ్‌ఫ)ను ప్రపంచ ఉగ్ర సంస్థగా ప్రకటించేలా భారత్‌ ఐక్యరాజ్యసమితిలో ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు భారత బృందం యూఎన్‌ భద్రతా మండలి ప్యానెల్‌కు టీఆర్‌ఎఫ్‌ కార్యకలాపాల గురించి వివరించింది. ఆంక్షల కమిటీ పర్యవేక్షణ బృందంతో పాటు ఐరాస భాగస్వామ్య దేశాలతోనూ చర్చించింది. అలాగే యూఎన్‌ ఆఫీస్‌ ఆఫ్‌ కౌంటర్‌ టెర్రరిజం, కౌంటర్‌ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరేట్‌ ఉన్నతాధికారులతోనూ భారత బృందం భేటీ అయింది.

Updated Date - May 16 , 2025 | 05:18 AM