Share News

Ram Mohan Naidu: విమాన ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ

ABN , Publish Date - Jun 15 , 2025 | 04:51 AM

ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

Ram Mohan Naidu: విమాన ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ

  • కూలడానికి కారణాలపై పరిశీలన

  • భవిష్యత్తు భద్రతపై రోడ్‌మ్యాప్‌

  • 3 నెలల్లో కమిటీ నివేదిక వస్తుంది

  • యాక్సిడెంట్‌లో తండ్రిని కోల్పోయా

  • బాధిత కుటుంబాల ఆవేదనను అర్థం

  • చేసుకోగలను: రామ్మోహన్‌నాయుడు

  • 274కు చేరిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీ, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కారణాలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈ కమిటీ సోమవారం సమావేశమై విమాన ప్రమాదంపై విచారణ చేపడుతుందని.. 3 నెలల్లో విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పిస్తుందన్నారు. విమాన ప్రమాదాలను నివారించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కార్యాచరణ ప్రణాళికను పరిశీలిస్తుందని, భవిష్యత్తులో భద్రతా చర్యల కోసం చేపట్టాల్సిన సమగ్ర, విధాన ఆధారిత రోడ్‌మ్యా్‌పను కూడా రూపొందిస్తుందని చెప్పారు. అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం నేపథ్యంలోవిమానయాన భద్రతపై శనివారం ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి సమీక్షించారు. అనంతరం ఉడాన్‌ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. విమాన ప్రమాద ఘటన యావత్‌ దేశ ప్రజల మనసులను కలచివేసిందని రామ్మోహన్‌నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. తన తండ్రి ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించారని, ప్రస్తుతం విమాన ప్రమాద బాధిత కుటుంబాలు అనుభవిస్తున్న బాధ, ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. విమానయానానికి సంబంధించి కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని, అయినా ఈ దుర్ఘటన చోటుచేసుకుందన్నారు. దీనిపై వైమానిక ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఐఐబీ) వెంటనే అధికారిక దర్యాప్తు ప్రారంభించిదన్నారు. బ్లాక్‌ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, దాని డీకోడింగ్‌తో ప్రమాదానికి ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందో స్పష్టత వస్తుందని తెలిపారు.


అన్ని రకాల డేటాను పరిశీలించి..

కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీలో.. పౌర విమానయాన శాఖ కార్యదర్శి, హోంశాఖ అదనపు కార్యదర్శితోపాటు గుజరాత్‌ హోంశాఖ, ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, అహ్మదాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, వైమానిక దళం భద్రత, తనిఖీల డైరెక్టర్‌ జనరల్‌, పౌర విమానయుయాన భద్రతా సంస్థ (బీసీఏఎస్‌) డైరెక్టర్‌ జనరల్‌లు, డీజీసీఏ ప్రతినిధులు, ఇంటెలిజెన్స్‌ బ్యూరో స్పెషల్‌ డైరెక్టర్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు వైమానిక రంగ నిపుణులు, ప్రమాద ఘటన దర్యాప్తు అధికారులు కూడా కమిటీలో ఉంటారు. విమాన ప్రమాదానికి సంబంధించి అన్ని రకాల వైమానిక రికార్డులు, సమాచారం, సాక్షుల వాంగ్మూలాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది.

274కి చేరిన మృతుల సంఖ్య..

ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల సంఖ్య 274కి చేరింది. ‘‘ప్రమాద స్థలం నుంచి ఇప్పటివరకు 274 మృతదేహాలను వెలికితీసి సిటీ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన నేపథ్యంలో.. కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో సరిపోల్చి నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తవగానే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు’’ అని బీజే వైద్య కళాశాల జూనియర్‌ వైద్యుల సంఘం అధ్యక్షుడు ధావల్‌ గమేటి తెలిపారు. ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు మరణించినట్టు ఎయిరిండియా ఇప్పటికే ప్రకటించింది. మిగతా 33 మందిలో వైద్య కళాశాల విద్యార్థులు, వైద్యులు, వారి కుటుంబ సభ్యులు, హాస్టల్‌ మెస్‌లో పనిచేస్తున్నవారు ఉన్నారు. కాగా ఇప్పటివరకు 19మంది డీఎన్‌ఏ నమూనాలను సరిపోల్చిన వైద్యులు మృతదేహాలను అప్పగించే ప్రక్రియ చేపట్టినట్టు సమాచారం. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు, శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాద స్థలాన్ని జాతీయ భద్రతాదళం (ఎన్‌ఎ్‌సజీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందాలు కూడా క్షుణ్నంగా పరిశీలించినట్టు సమాచారం. కాగా, ఎయిరిండియా విమానం కూలిపోయి దెబ్బతిన్న బీజే వైద్య కళాశాల హాస్టల్‌ భవనాలను ఖాళీ చేయిస్తున్నట్టు కాలేజీ డీన్‌ మీనాక్షి పారిఖ్‌ తెలిపారు.


మృతుల కుటుంబాలకు రూ.25లక్షల తక్షణసాయం

అహ్మదాబాద్‌ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు, ప్రాణా లతో బయటపడిన వ్యక్తికి తక్షణసాయంగా రూ.25లక్షల చొప్పున అందిస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. టాటా గ్రూపు ఇప్పటికే రూ.కోటి చొప్పున ప్రకటించిన పరిహారానికి ఇది అదనం. అయితే, ప్రమాదంలో గాయపడిన బీజే వైద్య కళాశాల మెడికోలు, వైద్యులు, వారి కుటుంబాలకు కూడా రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని టాటా గ్రూపు చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌కు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది.

ప్రమాదం వీడియో తీసిన బాలుడి సాక్ష్యం!

ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అవుతూనే, మెల్లగా కిందికి జారిపోయిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఆర్యన్‌ అనే 17 ఏళ్ల బాలుడు రోజూ లాగానే తాము ఉంటున్న ఇంటిపై నిలబడి విమానం టేకా్‌ఫను చిత్రీకరిస్తున్న సమయంలో ఆ ప్రమాదం రికార్డయింది. అహ్మదాబాద్‌ పోలీసులు ఆ బాలుడి నుంచి సాక్షిగా వాంగ్మూలం నమోదు చేశారు.


తొమ్మిది 787 విమానాల్లో భద్రతా తనిఖీలు పూర్తి

అహ్మదాబాద్‌ ప్రమాదం నేపథ్యంలో బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానాల్లో భద్రతా తనిఖీలు సాగుతున్నాయని, ఇప్పటికే 9విమానాల తనిఖీ పూర్తయిందని ఎయిరిండియా పేర్కొంది. ఎయిరిండియా వద్ద 787-8 విమానాలు 26, 787-9 విమానాలు 7 కలిపి మొత్తం 33 డ్రీమ్‌లైనర్‌ విమానాలున్నాయని తెలిపింది. మిగతా 24 విమానాల్లో తనిఖీలు చేపట్టనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ప్రమాదానికి గురైన బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానానికి 2023 జూన్‌లో పూ ర్తిస్థాయి నిర్వహణ తనిఖీలు జరిగాయని, వచ్చే డిసెంబరులో మళ్లీ జరగాల్సి ఉందని విమానయానశాఖ వర్గాలు తెలిపాయి. కుడి ఇంజన్‌ను ఈ ఏడాది మార్చిలో పూర్తిస్థాయిలో పునరుద్ధరణ పనులు చేసి బిగించారని, ఎడమ ఇంజన్‌కు ఏప్రిల్‌లో తనిఖీలు నిర్వహించారన్నాయి. జీఈ ఏరోస్పేస్‌ తయారుచేసిన ఈ ఇంజన్లలో ఏ సమస్యల్లేవని పేర్కొన్నాయి.

పవర్‌ పోయింది.. కిందికి పడిపోతున్నాం..

లండన్‌కు వెళ్లేందుకు టేకాఫ్‌ అయిన తర్వాత 36 సెకన్లకు.. మధ్యాహ్నం 1.39 గంటల సమయంలో పైలట్‌ సుమిత్‌ సభర్వాల్‌ నుంచి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కి అత్యవసర సందేశం వచ్చింది. ‘మేడే.. మేడే.. మేడే.. పవర్‌ పోయింది.. థ్రస్ట్‌ రావడం లేదు.. కిందికి పడిపోతున్నాం’’ అని పైలట్‌ అన్నారు. ఆ తర్వాత విమానం నుంచి ఏసిగ్నల్‌ రాలేదు. ఐదు సెకన్లున్న ఈ ఆడియో వైరల్‌గా మారింది.

Updated Date - Jun 15 , 2025 | 04:53 AM