BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
ABN , Publish Date - Apr 30 , 2025 | 07:04 PM
ఫోటోలో అంబేడ్కర్ సగం తల, భుజాలు కనిపిస్తుండగా, దానిని కలుపుతూ తక్కిన సగం ఫోటోలో ఇదే తరహా అఖిలేష్ కటౌట్ ఉంది. దీంతో అఖిలేష్ యాదవ్పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.

న్యూఢిల్లీ: భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (BR Ambedkar) ఫోటోను కలుపుతూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఉన్న చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో స్ప్లిట్ ఇమేజ్ (Spilit image)తో ఉంది. ఈ ఫోటోలో అంబేడ్కర్ సగం తల, భుజాలు కనిపిస్తుండగా, దానిని కలుపుతూ తక్కిన సగం ఫోటోలో ఇదే తరహా అఖిలేష్ కటౌట్ ఉంది. దీంతో అఖిలేష్ యాదవ్పై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అంబేద్కర్ ఫోటోను సగం చేయడం ఆమోదయోగ్యం కాదని ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తప్పుపట్టారు.
"భారత రాజ్యాంగ నిర్మాత, దళిత ఐకాన్ బాబాసాహెబ్ అంబేడ్కర్కు ఇంతకంటే పెద్ద అవమానం ఉండదు. అంబేడ్కర్ తలను సగానికి సగం చేసి దానికి అఖిలేష్ ముఖం తగిలించడం అవమానకరం. అఖిలేష్ ఎన్ని సార్లు పుట్టుంటారో కానీ అంబేడ్కర్ గొప్పతనానికి, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలకు అఖిలేష్ ఎప్పటికీ సమానం కాలేరు'' అని అమిత్ మాలవీయ మండిపడ్డారు.
ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ సైతం అఖిలేష్ చర్యలను తప్పుపట్టారు. ఇది సమాజ్వాదీ పార్టీ దుష్ట బుద్ధిని, అంబేడ్కర్ను ఉద్దేశపూర్వకంగా అవమానించడాన్ని చాటుతుందన్నారు. ప్రజలెవ్వరికీ ఈ చర్య ఆమోదయోగ్యం కాదని, ఇందుకు సమాజ్వాదీ పార్టీ సరైన సమయంలో తగిన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. ఈ పోస్టర్ అత్యంత అవమానకరమని యూపీ సామాజిక సంక్షేమం, ఎస్సీ/ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అసిం అరుణ్ వ్యాఖ్యానించారు. అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులు, వెనుకబడి వర్గాల పథకాలను నీరుగార్చిన వైనం అందరికీ తెలిసిందేనని అన్నారు.
అఖిలేష్ యాదవ్ చర్యపై బీజేపీ రాజ్యసభ ఎంపీ బ్రిజ్ లాల్ మరింత ఘాటుగా విమర్శించారు. ''బాబా సాహెబ్ పాదధూళి విలువ కూడా అఖిలేష్ చేయరు. అంబేడ్కర్ను ఇంతగా అవమానించిన ఆయనను దేశ ప్రజలు క్షమించరు'' అని అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎస్పీ నేతల మురికిరాజకీయాలకు ఇదొక నిదర్శనమని, ప్రజలు వారిని ఎప్పటికీ క్షమించరని అన్నారు. కాగా, పలు పార్టీల విమర్శలకు దారితీసిన ఈ ఫోటోపై సమాజ్వాదీ పార్టీ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ ఇంకా స్పందించ లేదు.